Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాలకు సమన్లు
న్యూఢిల్లీ: ముడుపుల వ్యవహారంతో రచ్చకెక్కిన సీబీఐ వివాదంలో ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) జోక్యం చేసుకున్నది. కేంద్రానికి తలనొప్పిగా మారిన ఈ అంశంలో సీబీఐ డైరెక్టరు అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టరు రాకేశ్ అస్థానాలకు పీఎంఓ సమన్లు జారీ చేసింది. అలోక్ వర్మ ఆదివారమే ప్రధానిని కలిశారు. రాకేశ్ అస్థానాకు ప్రధాని కార్యాలయం నుంచి సోమవారం పిలుపు అందింది. కాగా, ముడుపుల వ్యవహారంలో రాకేశ్ అస్థానాపై సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం, విజరు మాల్యా కేసు వంటి పెద్ద కేసుల్లో ఆయన దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ సందర్భంలో అస్థానాపై చర్యలు తీసుకోవడానికి సీబీఐ ఎలాంటి అనుమతి కోరలేదని పీఎంఓ వర్గాలు తెలిపినట్టు సమాచారం. మరోపక్క, అస్థానాతో కలిసి పనిచేసిన పోలీసు అధికారి, సిట్ సభ్యుడు దేవేందర్ కుమార్ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. సీబీఐ తన సొంత కార్యాలయాల్లోనే మరీ ముఖ్యంగా అస్థానాతో కలిసి పనిచేసిన అధికారుల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. అలోక్ వర్మపై చేసిన తప్పుడు ఆరోపణలతో కుమార్ను సీబీఐ నిందితుడిగా పేర్కొంటు అదుపులోకి తీసుకున్నది.
ఐఆర్సీటీసీ, ఐఎన్ఎక్స్ కేసుల దర్యాప్తు నుంచి సీబీఐ డైరెక్టర్ తప్పించారు : సీవీసీకి రాసిన లేఖలో రాకేశ్ అస్థానా
ఐఆర్సీటీసీ, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల దర్యాప్తు నుంచి సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మ తనను తప్పించారని ఆ సంస్థ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా కేంద్ర విజలెన్స్ కమిషన్(సీవీసీ)కి తెలిపారు. గత నెల 14న సీవీసీకి రాసిన లేఖలో అస్థానా దీని గురించి వివరించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్సీటీసీ కేసు దర్యాప్తు నుంచి అలోక్ వర్మ తనను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారని అందులో పేర్కొన్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలు ఆరోపణలు ఎదర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా స్కాం కేసు దర్యాప్తు నుంచీ తనను తప్పించారని లేఖలో ప్రస్తావించారు. గుజరాత్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి రాకేశ్ అస్థానాను ప్రధాని మోడీ ఏరికోరి సీబీఐ స్పెషల్ డైరెక్టర్గా తీసుకురాగా ప్రస్తుతం ఆయనపై లంచం తీసుకున్నాడన్న ఆరోపణలు రావడంతో కేంద్రానికి ఇది మరొక సమస్యగా మారింది.