Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం: కేరళపై కేంద్ర సర్కారు పక్షపాత వైఖరిని అనుసరిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. వరదలతో అతలాకుతలమైన రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టేందుకు కావలసిన విరాళాల కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన రాష్ట్ర మంత్రులను కేంద్రం అడ్డుకున్నదని సీఎం అన్నారు. కేరళపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పక్షపాత వైఖరికి ఇదే తాజా ఉదాహరణ అని తెలిపారు. ఐదు రోజులు యూఏఈలో పర్యటన ముగించుకుని సోమవారం తిరిగి వచ్చిన విజయన్ తిరువనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. విదేశాలనుంచి సహాయం తీసుకునేందుకు మోడీ సర్కారు ఆమోదించి ఉంటే ఇప్పటివరకు చాలా ఫండ్ను సేకరించేవారిమని, కానీ కేంద్రం అందుకు అనుమతించలేదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ విపత్తులు చోటుచేసుకున్నాయని, గుజరాత్లో ప్రకృతి వైపరీత్యం సంభవించినపుడు ఆ రాష్ట్రం విదేశీ సహాయాన్ని పొందేందుకు కేంద్రం అనుమతించిందని గుర్తు చేశారు. కేంద్రం ఇలా పక్షపాతంగా వ్యవహరిస్తూ.. ఏ రాష్ట్రానికైనా సమస్యను సృష్టించొద్దని కోరారు. ఈ పక్షపాత వైఖరితోనే కేరళ మంత్రులను విదేశీ పర్యటనలకు అనుమతించలేదని వివరించారు. విదేశాల్లో విరాళాలు సేకరించేందుకు సీఎం సహా 20 మంది మంత్రులు సిద్ధమవ్వగా..17 మంది మంత్రుల పర్యటనకు కేంద్రం అనుమతించలేదు. అలాగే కేరళకు యూఏఈ ప్రభుత్వం 700 కోట్ల సహాయాన్ని అందజేసేందుకు హామీ ఇచ్చిందనడంలో రహస్యమేమీ లేదని అన్నారు. యూఏఈ సహాయంపై కేంద్రం మోకాలడ్డుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంతోపాటు విపక్షంలోని కాంగ్రెస్ కూడా మోడీ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.