Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ పునరుద్ధరణకు చర్యలు
- ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయనున్న సర్కారు
తిరువనంతపురం: రెండు నెలల క్రితం సంభవించిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళలోని బాధిత రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న వ్యవసాయాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు విజయన్ సర్కారు పునరుద్దరణ చర్యలు చేపట్టనున్నది. ఇందులో భాగంగా బాధిత రైతులకు కేరళ సర్కారు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేయనున్నది. ' ప్రకృతి వైపరీత్యంతో రాష్ట్రం లో వ్యవసాయానికి తీవ్ర నష్టం ఏర్పడింది. ప్రధానంగా వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో సుమారుగా 2.45 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. పునరుద్దరణ చర్యలో భాగంగా బాధిత రైతులకు పంపిణీ చేయడానికి సుమారుగా 8వేల టన్నుల విత్తనాలను కొనాల్సిన అవసరం ఉంది' అని కేరళ అగ్రికల్చర్ సెక్రెటరీ డికె సింగ్ అన్నారు. 'వరితోపాటు అరటి, యాలకుల, సుగంధద్రవ్యాలు, కూరగాయలు, దుంపలు వంటి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. కాబట్టి వ్యవసాయ సాగు పునరుద్దరణ చర్యలో భాగంగా బాధిత రైతులకు విత్తనాలను ఉచితంగా సరఫరా చేయనున్నాం' అని ఆయన తెలిపారు. రైతులకు విత్తనాల పంపిణీ అనంతరం మూడు నెలల తర్వాత పెస్టిసైడ్స్, ఫర్టీలైజర్స్ వంటివి అందజేస్తామని ఆయన అన్నారు. పునరుద్దరణచర్యలో భాగంగా వ్యవసాయ యూనివర్సిటీలను, సంబంధిత ఏజెన్సీలనూ భాగస్వామ్యం చేయనున్నట్టు మొసాయిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాబిన్ ఎడ్విన్ అన్నారు. సాగుకు యోగ్యంగా నేలను తయారుచేయడానికి తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) సహకారాన్నీ తీసుకోనున్నట్టు సింగ్ వివరించారు. కాగా, ఈ సమస్యను ఎదుర్కోవడానికి కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్రాన్ని అదనపు నిధులనూ కోరింది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ నివేదిక ప్రకారం.. ప్రకృతి వైపరీత్య బీభత్సంతో అతలాకుతలమైన రాష్ట్ర పునర్నిర్మాణానికి దాదాపు రూ.25,046 కోట్లు అవసరమని, ఇందులో వ్యవసాయానికే రూ.2,093 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. కేరళప్రభుత్వ లెక్కల ప్రకారం.. 21వేల హెక్టార్లలో అరటి, 98వేల హెక్టార్లలో సుగంధ ద్రవ్యాలు, 35వేల హెక్టార్లలో యాలకుల, 365 హెక్టార్ల కాఫీ, 122 హెక్టార్ల రబ్బరు, 1.81 లక్షల టన్నుల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కాగా, కేరళ ప్రభుత్వ నిర్ణయంపై వరద బాధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు. అయితే కేరళ ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.