Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 29కి విచారణ వాయిదా
- అరెస్టయిన డీఎస్పీకి 7 రోజుల సీబీఐ కస్టడీకి ప్రత్యేక కోర్టు అనుమతి
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా యథాతథ స్థితిని(స్టేటస్ కో) కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ ఆస్తానా హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేయగా ఈ ఆదేశాలి చ్చింది. మనీలాండరింగ్ కేసులో నిందితుడి నుంచి లంచం తీసుకున్న కేసులో ఆస్తానాతోపాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్కుమార్పై సొంత సంస్థే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దేవేందర్కుమార్ను సోమవారమే సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో మరో నిందితుడు (హైదరాబాద్కు చెందిన వ్యాపారి) ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆస్తానాపై సీబీఐ అక్రమంగా ఎఫ్ఐఆర్ నమో దు చేసిందని ఆయన తరఫు న్యాయవాది అమరేంద్రశరణ్ కోర్టు ముందు వాదన వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు వెనుక సీబీఐ డైరెక్టర్కు దురుద్దేశమున్నదని న్యాయవాది శరణ్ ఆరోపించారు. దీనిపై స్పందించేందుకు సమయం కావాలని సీబీఐ కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 29కి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకూ ఆస్తానాను అరెస్ట్ చేయడంలాంటి కఠిన చర్యలేమీ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధిం చి నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న అన్నిరకాల ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరచాలని కోర్టు సూచించింది. ఈమేరకు సీబీఐ డైరెక్టర్, సిబ్బంది,శిక్షణశాఖ(డీవోపీటీ)కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, నిందితులపై దర్యాప్తు కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మరో పరిణామంలో ఇప్పటికే అరెస్టయిన డీఎస్పీ దేవేందర్కుమార్ను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దేవేందర్ను ప్రశ్నించేందుకు 10 రోజుల కస్టడీకి సీబీఐ కోరగా, వారం రోజులకు కోర్టు నుంచి అనుమతి లభించింది.
అరెస్ట్కు రంగం సిద్ధమైన వేళ..!
మనీలాండరింగ్ కేసులో నిందితుల్ని రక్షించేందుకు లంచం తీసుకున్నట్టు ఆరోపణలున్న ఆస్తానాపై సీబీఐ కఠిన చర్యలకు సిద్ధమైన సమయంలో ఆయన అనూహ్యం గా హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. ఇప్పటికే తమ సంస్థలో ప్రత్యేక డైరెక్టర్గా నెంబర్ టూ స్థానంలో ఉన్న రాకేశ్ ఆస్తానాను సస్పెండ్ చేసేందుకు సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మ ఫైల్ సిద్ధం చేసినట్టు ఓ అధికారి తెలిపారు. అతని తొలగింపునకు సంబంధించిన సిఫారసు ఫైల్ను ఒకటి, రెండు రోజుల్లో డీవోపీటీకి పంపనున్నట్టు ఆ అధికా రి తెలిపారు. తమ డైరెక్టర్కు వేరే అత్యవసర పని ఉండటం వల్ల ఫైల్ పంపడంలో ఆలస్యం జరిగిందని సీబీఐలోని ఆ అధికారి ఓ జాతీయ మీడియా సంస్థకు వెల్లడించారు.
వారం రోజుల క్రితం ఆస్తానాపై ఓ అవినీతి కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై ప్రధాని మోడీతో ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంగా సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మ వివరణ ఇచ్చారు. ఆస్తానాపై నమోదైన కేసు వివరాలను ప్రధానికి తెలియజేశారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారి సానా సతీశ్బాబు ఫిర్యాదుతో ఆస్తానాపై కేసు నమోదైంది. మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీపై నమోదైన మనీలాండరింగ్ కేసు నుంచి తమను తప్పించేందుకు రూ.5 కోట్లు డిమాండ్ చేశారని సతీశ్బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే కేసులో దర్యాప్తు సాగిస్తున్న ఆస్తానా తరఫున మధ్యవర్తులుగా చెప్పుకున్న దుబాయి వ్యాపారులు మనోజ్ప్రసాద్, సోమేశ్ప్రసాద్ అనే సోదరులు తనను రూ.5 కోట్లు డిమాండ్ చేయగా, ఇప్పటికే కొంత డబ్బు(డిమాండ్ చేసిన దానిలో సగానికి పైగానే) వారికి ముట్టజెప్పినట్టు సతీశ్బాబు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. గతేడాది డిసెంబర్లో దుబాయి నుంచి ఢిల్లీ వచ్చిన సోమేశ్ప్రసాద్ తమపై సీబీఐ దర్యాప్తు విషయమై రాకేశ్ ఆస్తానాతో మాట్లాడినట్టు చెప్పారని సతీశ్బాబు సీబీఐ డైరెక్టర్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే కేసులో మరో నిందితుడైన తమ సంస్థకే చెందిన డీఎస్పీ దేవేందర్కుమార్ను సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం గమనార్హం. రాకేశ్ ఆస్తానాపై మరో ఐదు అవినీతి కేసులు కూడా ఉన్నట్టు సీబీఐ ఇప్పటికే వెల్లడించింది. రాకేశ్ ఆస్తానాను సీబీఐ కేసుల దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈమేరకు సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మ మంగళవారంనాడు ఆదేశాలు జారీ చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి.
మోడీ మనిషి..!!
1984 బ్యాచ్ గుజరాత్ క్బాడర్ ఐపీఎస్ అధికారియైన రాకేశ్ ఆస్తానాను కేంద్ర ప్రభుత్వం 2017, అక్టోబర్ 22న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా నియమించింది. అయితే, అంతకుముందే ఆస్తానాను(2016 డిసెంబర్లో) సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్గా కేంద్రం నియమించింది. ప్రధాని మోడీకి సన్నిహితుడిగా ఆస్తానాకు పేరున్నది. దానిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో సీబీఐ డైరెక్టర్గా ఆస్తానాకు పదోన్నతి కల్పించాలన్న ఆలోచనను మోడీ ప్రభుత్వం విరమించుకున్నది. ఐదు వారాల తర్వాత సీబీఐకి పూర్తిస్థాయి డైరెక్టర్గా అలోక్వర్మను నియమించింది. అలోక్వర్మ త్వరలో రిటైర్ కానున్న సమయంలో ఆయన తర్వాతి స్థానంలో ఉన్న ఆస్తానాపై అవినీతి కేసు నమోదు కావడం గమనార్హం.