Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారుకు చెంపపెట్టు : ప్రతిపక్షాలు
- రిజర్వేషన్ల అంశం తేలాలి : బాబు
విజయవాడ : మూడు నెలల్లోగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 90వ నెంబర్ జిఓను కొట్టివేసింది. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి. తక్షణమే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రిజర్వేషన్ల వ్యవహారంతో ఎన్నికలను ముడిపెట్టారు. 'రిజర్వేషన్ల అంశం తేలాల్సిఉంది' అని ఆయన అన్నారు. 2013లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎన్నికైన పాలకవర్గాల పదవీకాలం ఆగస్టులో ముగిసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం 90వ నెంబర్ జిఓను జారీ చేసి సర్పంచ్ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. దీనిని సవాల్ చేస్తూ మాజీ సర్పంచ్లు హైకోర్టును ఆశ్రయిం చారు. ప్రజా స్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగా కాలయాపన చేస్తోందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఏ మాత్రం అనుభవం లేని జూనియర్లను కూడా స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తోందని ఫలితంగా పాలన తీవ్రంగా కుంటుపడు తోందని వారు ధర్మాసం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వాదోపవాదనలు విన్న హైకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో పంచాయతీలకు కూడా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై విశాఖ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ 'పంచాయతీ ఎన్నికలకు మేం సిద్ధంగానే ఉన్నాం. అయితే, రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉంది. దానిపై తీర్పు రావాల్సిఉంది. అది కూడా రానీవ్వండి. ఆ తరువాత రెండింటిని పరిశీలించి నిర్ణయాన్ని తీసుకుంటాం' అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమానమే...
కోర్టు తీర్పు నేపథ్యంలో మూడు నెలల్లో అధికారపార్టీ ఎన్నికలకు వెళ్తుందా లేదా అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలంటే ముందుగా రెవెన్యూ గ్రామాల వారీగా ఉండే ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీల వారీగా విభజించాల్సి ఉంటుంది. అనంతరం రొటేషన్ పద్ధతిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేయాలి. బీసీ రిజర్వేషన్ పంచాయతీలు, గ్రామ వార్డుల్లో కేటాయింపుల కోసం బీసీ జనాభాను వార్డుల వారీగా గ్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటే మూడు నెలల సమయం సరిపోతుంది. సమయం సరిపోదని, గడువు పెంచాలని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే, సాధారణ ఎన్నికలకు పిబ్రవరిలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వొచ్చని తెలిసింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్న ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా.
తక్షణమే ఎన్నికలు : సీపీఐ(ఎం)
హైకోర్టు తీర్పును గౌరవిస్తూ పంచాయతీలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, ఇక ఎంతమాత్రం కాలయాపన చేయకూడదని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు విడుదల చేసిన ప్రకటనలో హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టని పేర్కొన్నారు. పంచాయతీ పాలకవర్గాలకు ఆగస్టులోనే గడువు ముగిసినప్పటికీ సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల ద్వారా పాలన కొనసాగించడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 90నుహైకోర్టు రద్దు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు స్థానిక సంస్థలకు 73, 74 సవరణల ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడటానికి దోహదం చేస్తుందని తెలిపారు.
సక్రమంగా జరపండి : వైసీపీ
హైకోర్టు తీర్పుతో నైనా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వ హించాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గుతున్నాయని తెలిపారు. హైకోర్టు తీర్పును గౌరవించి వెంటనే ఎన్నికలు జరిపించాలని ఆమె కోరారు.
స్థానిక సంస్థలకు రక్షణ : జనసేన
పంచాయతీ రాజ్ చట్టాన్ని రక్షించేలా, స్థానిక సంస్థల అధికారాలను నిలబెట్టేలా హైకోర్టు తీర్పు ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రత్యేక అధికారుల పాలన సబబుకాదని తాము ముందునుండి చెబుతున్నాయని, ఎన్నికలు ఎదుర్కునే ధైర్యం లేకే రాష్ట్ర ప్రభత్వుం 90వ నెంబర్ జిఓను తీసుకొచ్చిందని చెప్పారు. . ప్రజలచే ఎన్నికైన ప్రతినిధులు లేకపోతే స్థానిక సమస్యలు ఏ విధంగా పరిష్కారమవుతాయని, ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు. కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో . ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.
కుంటిసాకులు మానండి : సీపీఐ
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కుంటిసాకులు మాని, పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విడుదల చేసిన ప్రకటనలో హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు.