Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్లడించిన ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: భారత్లో క్యాన్సర్ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆరేండ్లలో పెదాలు, నోటి క్యాన్సర్ కేసులు 114శాతం పెరిగినట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వెల్లడించింది. మద్యం, పొగాకు ఉత్పత్తుల సేవనం వల్ల పెదాలు, నోటి క్యాన్సర్ రోగుల సంఖ్య రెట్టింపయినట్టు వివరించింది. 2012లో 56వేల నోటి క్యాన్సర్ కేసులు నమోదవగా, 2018 ఈ సంఖ్య 1.19లక్షలకు పెరిగినట్టు తెలిపింది. క్యాన్సర్ వ్యాధుల కేసులు పెరగడమే కాదు, ఈ వ్యాధిగ్రస్తుల మరణాలూ పెరుగుతున్నాయని పేర్కొంది. 2012లో ఏడు లక్షల మంది క్యాన్సర్ మూలంగా మరణించగా 2018లో 7.84లక్షల మంది మృతి చెందినట్టు వివరించింది.
185 దేశాల్లో 36 రకాల క్యాన్సర్ వ్యాధుల గురించిన సమాచారాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ), ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్సీ)లు ఇటీవలే ప్రచురించాయి. కాగా, ఐసీఎంఆర్ ఈ సమాచారాన్ని సేకరించి విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశంలో 2012లో మొత్తంగా 10లక్షల క్యాన్సర్ కేసులు నమోదు కాగా 2018లో ఈ సంఖ్య 11.5లక్షలకు చేరినట్టు తెలిపింది. కాగా, నోటి క్యాన్సర్ తర్వాత ఛాతి క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నట్టు తేలింది. ఈ ఆరేండ్ల కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ రోగులు 10 శాతం పెరిగినట్టు అధ్యయనంలో తేలింది. అలాగే నోటి క్యాన్సర్ దేశంలోని పురుషుల్లో అధికంగా కనిపిస్తుందని తెలిపింది. కాగా, సర్వికల్ క్యాన్సర్ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. ఈ ఆరేండ్ల కాలంలో సర్వికల్ క్యాన్సర్ కేసులు 21శాతం తగ్గాయని తెలిపింది.