Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీవీసీ, పీఎంఓపై అలోక్ వర్మ విమర్శలు
న్యూఢిల్లీ: విధానపరమైన అక్రమాలకు పాల్పడిన అభియోగాలపై విచారణ ఎదుర్కొంటూ ఇటీవల పదవి నుంచి తప్పుకున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ విచారణ జరుపుతున్న కేంద్ర విజిలెన్స్ కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. వర్మ చేస్తున్న ఈ ఆరోపణలు, విమర్శలతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇరుకునపడటం తథ్యమని పరిశీలకులు చెబుతున్నారు. తన ఆధీనంలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభానికి మోడీ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆయన అన్నారు. సీబీఐ అదనపు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రాకేశ్ ఆస్తానా అవినీతికి పాల్పడినట్ట ఆరోపిస్తూ అలోక్ వర్మ ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆస్తానా అలోక్ వర్మే అవినీతి చర్యలకు పాల్పడుతున్నారని ఎదురుదాడికి దిగారు. దీనిపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు ఇరువురు ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్ను ఆదేశించింది. ఈ క్రమంలో సీవీసీ తన విచారణకు సంబంధించి ఒక ప్రశ్నావళిని అలోక్ వర్మకు పంపింది.
అలోక్ వర్మ ఏమంటున్నారంటే..
ఈ ప్రశ్నావళిపై అలోక్ వర్మ స్పందనకు సంబంధించిన పత్రాలను ఒక మీడియా సంస్థ సేకరించింది. ఇందులో సీబీఐ అదనపు డైరెక్టర్గా వున్న ఆస్తానాపై ఆరోపణలు చేయటంతో పాటు సీవీసీ విచారణ తీరును వర్మ తప్పుపట్టారు. ఆస్తానా తనపై చేసిన 'నిరాధార'మైన ఆరోపణలపైనే సీవీసీ దృష్టిపెట్టిందని స్పష్టం చేశారు. తన డిప్యూటీ అధికారి అవినీతిపై సీబీఐ కేసు నమోదుచేసిన తరువాతే ఆయన తనపై ఫిర్యాదు చేశాడని వర్మ తన జవాబులో పేర్కొన్నారు. రాకేశ్ ఆస్తానా ఆగస్టు 24న క్యాబినెట్ కార్యదర్శికి తనపై చేసిన ఫిర్యాదులోని ఆరోపణలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీవీసీని ఆదేశించినప్పటికీ అందులోని ఒక్క ఆరోపణపై కూడా తనను ప్రశ్నించలేదని అలోక్ వర్మ ఆరోపించారు. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఆగస్టు 24 తరువాత తాను చేపట్టిన చర్యలకు సంబంధించి అక్టోబర్ 18న ఆస్తానా రాసిన లేఖలోని అంశాలపైనే అధికశాతం ప్రశ్నలున్నాయని ఆయన వివరించారు. రాకేశ్ ఆస్తానా ప్రమేయం వున్న అవినీతి కేసును సిబిఐ నమోదు చేసిన తరువాత మాత్రమే ఆస్తానా ఈ లేఖ రాశారని, ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజ్ ప్రసాద్ను సీబీఐ అరెస్ట్ చేసిందని, ఆస్తానాకు రు.3 కోట్లు లంచం చెల్లించినట్టు చెబుతున్న హైదరాబాద్ వ్యాపారవేత్త సానా సతీష్ వాంగ్మూలాన్ని నమోదు చేసిందని వర్మ తన జవాబులో పేర్కొన్నారు. దీనితో పాటు ఆస్తానాకు వ్యతిరేకంగా వాట్సాప్ సందేశాల, కాల్ వివరాల రూపంలో అనేక ఆధారాలు లభించాయన్నారు.
ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తునకు సంబంధించి సీవీసీ స్థాయిని ఆయన ప్రశ్నించారు. ఆస్తానా, సీవీసీ కెవి చౌదరికి ఈ విషయంలో ప్రధాని కార్యాలయం ఉన్నతాధికారి నుంచి మద్దతు లభిస్తున్నదని భావిస్తున్నట్టు తెలిపారు. సీవీసీ ప్రశ్నావళిలో తన నీతి, నిజాయితీ, నిష్పాక్షికతలను సంశయించిందని వర్మ ఆరోపించారు. తన 39 ఏండ్ల కెరీర్లో నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు దళాలకు, సీబీఐతో సహారెండు అగ్రగామి దర్యాప్తు సంస్థలకు సారధ్యం వహించానని ఆయన గుర్తు చేశారు. సీవీసీ ప్రశ్నించిన తీరు తనను విస్మయానికి గురి చేసిందన్నారు. ఒక వేళ తాను నిందితుడినే అయితే తన నిర్దోషిత్వాన్ని నిరూ పించుకోవాల్సిన బాధ్యత తనపైనే వుంటుందని, ఇందుకు మరో మార్గం లేదని సీవీసీకి రాసిన లేఖలో వర్మ స్పష్టం చేశారు. ఆస్తానాను అమాయకుడిగా నిరూపించేందుకు సీవీసీ ప్రయత్నించినట్టు తనకు కన్పిస్తోందన్నారు. రాకేశ్ ఆస్తానా నీతి, నిజాయితీలపై తాను గత ఏడాది సీవీసీ వద్ద అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేశానని, అయితే సీవీసీ మాత్రం తన మాటను పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు. 2017లో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా ఆస్తానాను నియమించటంపై తాను వ్యక్తంచేసిన అభ్యంతరాలను సీవీసీతో పాటు ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలోని సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ తోసిపుచ్చిందన్నారు. ఆస్తానాపై ఆరు అవినీతి కేసులను ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుపుతుండగా, ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి ఆయన్ను సీబీఐలో నియమించారని వర్మ ఆరోపించారు.