Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ను తిరస్కరించిన ఓటర్లు
- ప్రాంతీయ పార్టీ ఎంఎన్ఎఫ్కే పట్టం
- ఒక్క స్థానానికే పరిమితమైన బీజేపీ
మిజోరంలో వార్ వన్సైడ్ అయింది. అక్కడి ఓటర్లు కాంగ్రెస్ను తిరస్కరించారు. స్పష్టమైన మెజారిటీతో ప్రాంతీయ మిజోనేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)కే అధికారాన్ని కట్టబెట్టారు. స్వతంత్రులు నిర్ణయాత్మక శక్తిగా మారుతారని ఎగ్జిట్ పోల్స్లో తేలినప్పటికీ ఇక్కడ అందుకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. ఇక ఎలాగైనా అధికారాన్ని చేజిక్కిచ్చుకోవాలని భావించిన బీజేపీకి ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆ పార్టీని ఇక్కడ కేవలం ఒక్క స్థానానికే పరిమితం చేశారు.
ఐజ్వాల్: రాబోయే లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లు కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెడితే.. మిజోరం మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. అతి చిన్నదైన ఈ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సాక్షాత్తు రాష్ట్ర సీఎం లాల్ తన్హావ్లా పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఓడిపోయారు. మొత్తం 40 స్థానాలకు గానూ అధికార కాంగ్రెసు కేవలం ఐదు స్థానాలకే పరిమితమైంది. ప్రతిపక్ష మిజోనేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) 26 స్థానాల్లో గెలుపొందింది. దీంతో మేజిక్ ఫిగర్ను దాటి పదేండ్ల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీకి మార్గం సుగమమైంది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలనుకున్న కాంగ్రెస్ ఆశలు ఆవిరైపోయాయి. తాజా విజయంతో ఐజ్వాల్లోని ఎంఎన్ఎఫ్ కార్యాలయం బయట స్వీట్లు పంచుకొని, నృత్యాలు చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మిజోరంలోనూ ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరిన బీజేపీని అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఆ పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. మిగిలిన ఎనిమిది స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 34 స్థానాలు గెలుపొంది అధికారాన్ని చేపట్టగా.. ఎంఎన్ఎఫ్ ఐదు స్థానాలు, ఇతరులు ఒక స్థానాన్ని గెలుపొందారు. మొత్తం 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీ ఎన్నికలు గతనెల 28న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 80శాతం ఓటింగ్ నమోదైంది. దాదాపు 11లక్షల జనాభా ఉండే మిజరంలో క్రిస్టియన్లు 87శాతం, బుద్ధులు ఎనిమిదిశాతం, హిందువులు 2.5శాతం ఉన్నారు.
రెండుస్థానాల్లో ఓడిన సీఎం
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర సీఎం లాల్ తన్హవ్లాకూ షాకిచ్చాయి. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి కాంగ్రెస్ తరఫున లాల్తన్హావ్లా నాలుగు పర్యాయాలు సీఎం పదవిని చేపట్టారు. ఈ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం సెర్చిప్తో పాటు చంపారు సౌత్ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. సెర్చిప్లో జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) సీఎం అభ్యర్థి లాల్దుహోమా చేతిలో, చంపారు సౌత్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి టిజే లాల్నున్తులంగా చేతిలో సీఎం ఓటమి చెందారు.
చతికల పడ్డ బీజేపీ
ఒక్క స్థానానికే పరిమితం
కేంద్రంలో ఉన్న అధికార బలాన్ని ఉపయోగించి ధనబలంతో ఎలాగైనా అధికారంలోకి రావడానికి ప్రయత్నించిన బీజేపీని మిజోరం ఓటర్లు తిరస్కరించారు. త్రిపుర, మేఘాలయ, మణిపూర్ వంటి ఇతర ఈశాన్య రాష్ట్రాల మాదిరి ఇక్కడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన బీజేపీ పాచికలు పారలేదు. తొలుత ఎంఎన్ఎఫ్ తమ మిత్రపక్షమని ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించింది. క్రిస్టియన్లు అధికంగా ఉండే ఈ రాష్ట్రంలో బీజేపీతో కలిసివెళ్తే అధికారాన్ని చేపట్టడం కష్టమని భావించిన ఎంఎన్ఎఫ్ ముందు జాగ్రత్తగా ఆ పార్టీని దూరం పెట్టింది. అలాగే బీజేపీ మతవిభజన రాజకీయాలు ఇక్కడి ప్రజలపై ఎలాంటి ప్రభావమూ చూపలేదు. క్రిస్టియన్లు, మిజో గిరిజనులు అధికంగా ఉండే ఈ రాష్ట్రంలోని ఓటర్లు కాషాయపార్టీని ఒక్క స్థానానికే పరిమితం చేశారు. ప్రధాని మోడీ, ఆ పార్టీ చీఫ్ అమిత్షా, ఇతర అగ్రనాయకులు ప్రచారం చేసినప్పటికీ బీజేపీకి ఏమాత్రం లాభాన్ని చేకూర్చలేకపోయాయి.
ఆనవాయితీగా వస్తున్న 'రెండు పర్యాయాల పాలన'
మిజోరం 1987లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అనంతరం 1989 నుంచి వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్, ఆతర్వాత 1998 నుంచి రెండు పర్యాయాలు ఎంఎన్ఎఫ్లు అధికారాన్ని పంచుకున్నాయి. ఇక తిరిగి 2008లో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టి మరో రెండుపర్యాయాలు (2018 వరకు) మిజోరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఎంఎన్ఎఫ్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో మిజోరంలో ఆనవాయితీగా వస్తున్న రెండు పార్టీల 'రెండు పర్యాయాల పాలన' కొనసాగినట్టయ్యింది.
సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: జోరంతంగా
మిజోరంలో ప్రజల ఇచ్చిన విస్పష్ట మెజారిటీతో తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎంఎన్ఎఫ్ చీఫ్ జోరంతంగా తెలిపారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మద్యపానంపై నిషేధం విధిస్తామని, రోడ్ల నిర్మాణం వంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన అన్నారు. తాము యూపీఏలో చేరబోమని తెలిపారు.
ఎంఎన్ఎఫ్కు కలిసొచ్చిన మద్యపాన నిషేధం అంశం
ఎంఎన్ఎఫ్ విజయంలో మద్యపాన నిషేధం, అభివృద్ధి అనే రెండు అంశాలు ఆ పార్టీకి ప్రధానంగా కలిసి వచ్చాయి. కొన్నేండ్లుగా రాష్ట్రంలో మద్యంపై ఉన్న నిషేధాన్ని అధికార కాంగ్రెస్ 2015లో ఎత్తేసింది. యువత డ్రగ్స్కు అలవాటు పడుతున్నారన్న కారణంతోనే మద్యపానంపై నిషేధం ఎత్తివేశామని కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో చెప్పుకుంది. అయితే అక్కడి రాష్ట్రరాజకీయాలను శాసించే చర్చిలు మాత్రం మద్యపానానికి పూర్తి వ్యతిరేకం. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానంపై తిరిగి నిషేధం విధిస్తామని ఎంఎన్ఎఫ్ ప్రకటించింది. దీంతో అక్కడ చర్చిల మద్దతు ఎంఎన్ఎఫ్కు లభించింది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత, సీఎం లాల్ తన్హావ్లాపై అవినీతి ఆరోపణలు కూడా ఎంఎన్ఎఫ్ విజయానికి బాటలు వేశాయి.