Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ను ఊరిస్తున్న విజయం
- 15ఏండ్ల తర్వాత తొలిసారి సెంచరీ
- మెజార్టీ మార్కు 116పై సందిగ్థత
- కాషాయపార్టీని తిరస్కరించిన ఓటర్లు
భోపాల్: మధ్యప్రదేశ్ ఓటరు అధికార బీజేపీని ఓడిస్తూ స్పష్టమైన తీర్పు చెప్పాడు. కానీ కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ దక్కుతుందా ?అన్నది తేలలేదు. మంగళవారం రాత్రి తుది ఫలితాల ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి 111స్థానాల్లో (ఓట్ల శాతం 41.54శాతం) ఆధిక్యత ఏర్పడింది. బీజేపీ 111 స్థానాల్లో (ఓట్ల శాతం 41) గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏదేమైనా స్వల్ప ఓట్ల తేడాతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంటుదన్న వార్తలు వెలువడ్డాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఓట్ల రూపంలో వ్యక్తమైంది. తమ పంటలకు తగిన గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని, రుణాలు మాఫీ చేయడం లేదని ప్రభుత్వం పట్ల రైతుల్లో వ్యతిరేకత ఉంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 2017లో మంద్సార్లో రైతులు నర్విహించిన ర్యాలీపై పోలీసులు కాల్పులు జరపడంతో ఆరుగురు రైతులు మరణించారు. అప్పటి నుంచి ప్రభుత్వం పట్ల రైతుల ఆగ్రహం మరింత పెరిగింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య యువతను వేధిస్తోంది. బీజేపీ ప్రభుత్వం గత 14 ఏండ్లలో ఏటా 17,600 ఉద్యోగాలను మాత్రమే కల్పించకలిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏండ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడం కూడా నిరుద్యోగులకు కోపం తెప్పించింది. జ్యోతిరాధిత్య సింధియా, కమల్నాథ్లో ఎవరు ప్రభుత్వ సారథులో నిర్ణయించక పోవడం కూడా కాంగ్రెసకు కలిసి వచ్చింది.
తది రౌండ్లు పూర్తయితేగానీ..
నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డ బీజేపీ, కాంగ్రెస్లు తుది రౌండ్ల వరకూ ఉత్కంఠ పెంచేలా పోటీపడుతున్నాయి. ప్రారంభం నుంచీ బీజేపీ, కాంగ్రెస్ల మధ్య స్వల్ప ఆధిక్యంతో విజయం దోబూచులాడుతున్నా తాజాగా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు. తుది రౌండ్లు లెక్కింపు పూర్తవుతున్న కొద్దీ, ఇరు పార్టీల మధ్య బలాబలాలు మారుతున్నాయి. నాలుగు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న బీఎస్పీ, ఆరు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఇతరులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నాయి. ఫలితాల సరళిని పరిశీలిస్తే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ, ఇతరుల సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తోంది.
రెండు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటలాగా ఉన్న మధ్యప్రదేశ్లో ఎలాగైతేనేమీ కాంగ్రెస్ పాగా వేసేట్టు కనపబడుతోంది. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 173 స్థానాలు కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ పార్టీకి కేవలం 38 స్థానాలు మాత్రమే దక్కాయి. బీఎస్పీకి 2, సమాజ్వాదీ పార్టీకి 7, జీజీపీకి 3, ఇతరులకు 7 స్థానాలు దక్కాయి. 2008 ఎన్నికల్లో బీజేపీ 143 స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రాగా.. కాంగ్రెస్ పార్టీకి 71, బీఎస్పీ 7, బీజేఎస్పీకి 5 స్థానాలు దక్కాయి. ఇక 2013 ఎన్నికల్లో బీజేపీ 165 చోట్ల గెలిచి హ్యాట్రిక్ సాధించగా కాంగ్రస్ 58 స్థానాలతో సరిపెట్టుకుంది. బీఎస్పీ-3, ఇతరులు-4 స్థానాల్లో విజయం సాధించారు.