Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్లో బీజేపీకి భంగపాటు
- ప్రచారంలో పని చేయని హిందూత్వ ముద్ర హస్తానికే అధికారమిచ్చిన ఓటర్లు
- అతి పెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ సత్తా చాటిన రెబెల్ అభ్యర్థులు
రాజస్థాన్లో బీజేపీకి దారుణ పరాభవం ఎదురైంది. ఏకపక్ష నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వసుంధరా రాజేను ఓటర్లు ఇంటికి సాగనంపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 163 స్థానాలతో జయకేతనం ఎగురవేసిన ఆ పార్టీ ఇప్పుడు 73 స్థానాలతోనే సరిపెట్టుకొని భారీ అపజయాన్ని మూటగట్టుకున్నది. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన కాంగ్రెస్.. ఈసారి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది. రాష్ట్రంలో చాలాకాలంగా ప్రభుత్వం ఐదేండ్లకోసారి మారుకుంటూ వస్తుండగా.. ఈసారీ అదే పునరావృతం కావడం గమనార్హం.
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ కూటమి మొత్తం 100 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి మ్యాజిక్ ఫిగర్(101)కు చేరువైంది. బీఎస్పీ 6 స్థానాల్లో విజయం సాధించగా ఇతరులు 18 చోట్ల గెలుపొందారు. సీపీఐ(ఎం) రెండు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వసుంధర రాజే సర్కారు ఒంటెద్దు పోకడకు జనం ఓటుతో బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో అధికార పార్టీ 73 స్థానాల్లోనే విజయం సాధించింది. రాష్ట్రంలోని 200 నియోజకవర్గాలకు గానూ, 199 స్థానాల్లో ఈనెల 7న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రామ్గఢ్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ గుండెపోటుతో మరణించడంతో ఆ స్థానానికి పోలింగ్ వాయిదా పడింది. కాగా.. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఎస్పీలు ఒంటరిగానే బరిలోకి దిగగా.. కాంగ్రెస్ మాత్రం రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ), లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ), ఎన్సీపీతో పొత్తుపెట్టుకున్నది. బీజేపీ 199 స్థానాల్లో పోటీ చేయగా.. కాంగ్రెస్ 194, ఆర్ఎల్డీ 2, ఎన్సీపీ 1, ఎల్జేడీ 2 స్థానాల్లో పోటీ చేశాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21, బీఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించాయి.
ఫలితమివ్వని బీజేపీ అగ్రనేతల ప్రచారం.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ఆ పార్టీ చీఫ్ అమిత్ షా, ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తదితర అగ్రనేతలు పాల్గొన్నా పెద్దగా ఫలితం దక్కపోవడం గమనార్హం. హిందూత్వవాదాన్ని నెత్తికెత్తుకొని లబ్ది పొందాలన్న బీజేపీ పాచిక పారలేదు. ప్రచారంలో ప్రజా సంక్షేమ అంశాలపై మాట్లాడేది, వాగ్దానాలిచ్చేది పోయి అయోధ్యలో రా మాలయాన్ని నిర్మించి తీరుతామంటూ పలికిన ప్రగల్భాలను జనం పట్టించుకోలేదు.
రాజే సర్కారుపై అసంతృప్తి
రాజస్థాన్లో రాజే ప్రభుత్వం వచ్చింది మొదలు తీసుకున్న నిర్ణయాలన్నీ దాదాపుగా వివాదాస్పదమైనవి. ప్రజల ఆందోళనలకు తలొగ్గి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను వెనక్కి కూడా తీసుకున్నదంటే రాష్ట్రంలో బీజేపీ పాలనాతీరు ఎలా ఉందో అర్థమవుతున్నది. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు, దళితులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మోడీ సర్కారు చేసిన నోట్లరద్దు కారణంగా రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పరిశ్రమలకు వంతపాడుతూ కార్మిక హక్కులను కాలరాసిన ఘటనలూ లేకపోలేదు. మరోవైపు ఓటమి అంగీకరిస్తున్నట్టు ప్రకటించిన వసుంధరా రాజే తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
కర్ణిసేన, రాజ్పుత్ల మద్దతూ లభించని వైనం
ఎన్నో ఏండ్లుగా బీజేపీకి కర్ణిసేన, రాజ్పుత్ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల మద్దతు లభిస్తూ వస్తుండగా.. ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. పద్మావత్ సినిమా వివాద సమయంలో తమకు ప్రభుత్వ సహకారం లభించలేదని కర్ణిసేన, రాజ్పుత్ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు చేశారు.
నిరాశలో నిరుద్యోగులు
గత ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధికారంలోకొస్తే 15 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని బీజేపీ హామీనిచ్చింది. కానీ, ఉద్యోగాలు కల్పించడంలో రాజే సర్కారు పూర్తి వైఫల్యం చెందడంతో నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
రైతులు, దళితులు, ముస్లిముల్లో వ్యతిరేకత
రాజే హయాంలో రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. పంటలకు మద్దతు ధర లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు చాలాసార్లు ఆందోళనలు చేపట్టారు. ఇదే క్రమంలో రైతులు రాష్ట్రంలోని జాతీయ రహదారులను ఏకంగా 48 గంటల పాటు దిగ్బంధించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2013 ఎన్నికల్లో బీజేపీకి దళితులు ఎక్కువ సంఖ్యలో మద్దతిచ్చారు. కానీ, రాజే ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయడంలో మోడీ సర్కారు చూపిన అలసత్వం కూడా దళితుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. బీజేపీపై ముస్లింలు తీవ్ర వ్యతిరేకత చూపుతూ వస్తున్నారు. రెండేండ్ల వ్యవధిలో అల్వార్లో గో రక్షణ పేరుతో హిందూత్వ మూకలు.. ఇద్దరు ముస్లిం వ్యక్తులపై(పెహ్లూఖాన్, రక్బర్ఖాన్) దాడి చేసిన ఘటనలు వారిలో ఆగ్రహావేశాలను రేకెత్తించాయి.
- ఈ ఎన్నికల్లో రాష్ట్ర గో సంరక్షణ శాఖ మంత్రి ఒటారమ్, నీటి వనరుల శాఖ మంత్రి రామ్ ప్రతాప్లు ఓటమిని చవిచూశారు.
- కాంగ్రెస్, బీజేపీ నుంచి టిక్కెట్ దక్కని నేతలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు. వీరిలో దాదాపు 10 మంది గెలవడం విశేషం.
- ప్రభుత్వంపై వ్యతిరేకత దృష్ట్యా మంత్రులు సహా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓటమి తప్పలేదు.
- మళ్లీ అధికారంలోకొస్తే రూ.5 వేల నిరుద్యోగ భృతి, 50 లక్షల ఉద్యోగావకాశాలు, కల్పిస్తామని బీజేపీ చెప్పిన మాటలు నిరుద్యోగులను ఆకర్షించలేకపోయాయి.
రాహుల్కు కానుక : సచిన్ పైలట్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేసిన విశేష కృషికి ఈ ఎన్నికల ఫలితాలను కానుకగా ఇస్తున్నట్టు యువనేత సచిన్ పైలట్ అన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలే తమను గెలిపించాయని తెలిపారు. మరోవైపు.. బుధవారం ఉదయం జైపూర్లో సమావేశం కానున్నామని, ముఖ్యమంత్రి ఎవరనేది అప్పుడే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ అన్నారు.
కాంగ్రెస్కు కలిసొచ్చిన 'హామీలు'
ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్కు కలిసొస్తే.. ఇచ్చిన హామీలు సైతం ఆ పార్టీ విజయానికి బాటలు వేశాయి. దాంతోపాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలు ఓటర్లను ఆకర్షించాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేసిన ప్రచారం విశేషంగా ఆకట్టుకున్నది. కష్టాల కడలిలో ఉన్న అన్నదాతలకు భారీ ఉపశమనం లభించేలా ఉన్న ఈ హామీ కాంగ్రెస్కు అనూహ్య మద్దతు తెలిపేలా చేసింది. దాంతోపాటు విద్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్ చేసిన హామీలు ఓటర్లను ఆకర్షించాయి.