Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రకారుల సలహాలు కోరిన తమిళ సర్కారు
చెన్నై: ఇన్నాళ్లు ఉత్తర భారతానికి మాత్రమే పరిమితమైన ప్రాంతాల పేర్ల మార్పు ప్రక్రియ ఇప్పుడు దక్షిణ భారతానికి తాకింది. తమిళనాడులో దాదాపు మూడు వేల ప్రాంతాల పేర్లను మార్చాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. దీనికి సంబంధించి ఓ హై లెవల్ కమిటీని కూడా పళిని సర్కారు నియమించింది. ఈ కమిటీ.. తమిళనాట ఉన్న ప్రముఖ చరిత్రకారులు, పరిశోధకుల నుంచి సలహాలు, సూచనలను కోరినట్టు సమాచారం. వారి నుంచి సలహాలు సేకరించిన పిమ్మట.. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేర్లను మార్చాలని సర్కారు చూస్తోంది. ఒకవేళ ఇదే పూర్తైతే, మునుపెన్నడూ లేనంతగా తమిళనాట పేర్ల మార్పు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ట్రిప్లికేన్ తిరువల్లికేనిగా, తిరుచ్చి తిరుచిరాపల్లిగా, టుటికోరీన్ తూతుకుడిగా మారనున్నాయి. ఈ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించగా.. తంతారు పెరియార్ ద్రవిడ కజగమ్ ప్రతినిధి కె.రామకృష్ణ భిన్నంగా స్పందించారు. రాష్ట్రంలో బ్రిటీషు వారి జ్ఞాపకార్థంగా పలు ప్రాంతాల పేర్లు ఉన్నాయని, వాటిని మార్చకూడదని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే.. కుల, మత ప్రాతిపదికన ప్రాంతాలకు పేర్లను పెట్టకూడదని అన్నారు. 1979లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎం.జి. రామచంద్రన్.. నగరాలలో కులాల పేరిట ఉన్న వీదులు, కూడళ్ల పేర్లను మార్చారు.