Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటమికి చంద్రబాబూ ఓ కారణమే :
- సీపీఐ కార్యదర్శి కె నారాయణ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
''తెలంగాణ ఎన్నికల ఫలితాలు కమ్యూనిస్టులకు ఓ గుణపాఠమే. అయితే, సీట్ల కోసమే తాము కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్లతో కూటమి కట్టలేదు. దీర్ఘకాలిక ప్రయోజనాలు, పోరాటాల నిర్వహణ సంయుక్తంగా చేయాలని భావించాం. ప్రజా ఉద్యమాల్లో కలిసి పోరాడాలి. మరో ఆరు నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో కూటమి తరఫున కలిసి పోటీ చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి...'' అని సీపీఐ కార్యదర్శి కె నారాయణ అభిప్రాయపడ్డారు. కూటమిలో చివరి వరకూ సీట్ల సర్దుబాటు జరగలేదని, దాంతోనే చాలావరకు అభ్యర్థులు ప్రచారంలో వెనకబడ్డారన్నారు. కూటమితో పార్టీల నాయకులు మాత్రమే కలిశారనీ, కిందిస్థాయి కార్యకర్తలు కలవలేదని తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందిన కేసీఆర్, ఎన్నికల్లో ఓడిపోతారని భావించామని తెలిపారు. అయితే, గతం కంటే ఓట్లు, సీట్లు పెరగడం ఆశ్చర్యకరమన్నారు. సంక్షేమ పథకాలను తక్కువగా అంచనా వేశామని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటిలో ఏదో ఒకరూపంలో పథకాల ద్వారా లబ్ది చేకూరిందని అన్నారు. ఆ లబ్ది పొందిన ప్రజానీకం ఓట్ల రూపంగా మారి, ఫలితాల్లో చాలా ప్రభావం చూపిందని తెలిపారు. కూటమి ఓటమికి చంద్రబాబు కూడా ఒక కారణంగా మారరని అన్నారు. ఆయన్ను తెలంగాణ వ్యతిరేకిగా కేసీఆర్ ముద్ర వేశారని చెప్పారు. ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ ఒక్కటిగా ఉండకపోవడం కూడా మంచి ఫలితం రాలేదన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురైందని, రాబోయే రోజుల్లోనూ ఇవే సంకేతాలు కనబడుతున్నాయని చెప్పారు. మోడీ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. బీజేపీ తీసుకొచ్చిన సంస్కరణలు కార్పొరేట్లకే ఉపయోగపడ్డాయని, సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని తెలిపారు.