Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ, వైసీపీ ఎంపీలు డిమాండ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీకి చెందిన ఎంపీలు ఆందోళన చేపట్టారు. బుధవారం నాడు పార్లమెంట్లోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ, టీడీపీ ఎంపీలు ధర్నా చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని, నినాదాలిస్తూ ఆందోళన చేపట్టారు. టీడీపీ ఎంపీలు అశోక్ గజపతి రాజు, గల్లా జయదేవ్, టీజీ వెంకటేశ్, మురళీ మోహన్, శివప్రసాద్, కనకమేడల రవీంద్ర కుమార్, కొనకళ్ల నారాయణ, అవంతి శ్రీనివాస్, మాల్యాద్రి, బుట్టా రేణుక ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీని మోసం చేసిందని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ ఎంపీలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో తమ పోరాటం కొనసాతుందని అన్నారు. హోదా కోసం వైసీపీి 2014 నుంచి పోరాటం చేస్తోందని, నోటీసులు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు మోసం వల్లనే ప్రత్యేక హోదా రాలేదని, తెలంగాణ ప్రజలు ఆయనకు దిమ్మతిరిగే జవాబిచ్చారని పేర్కొన్నారు. అదే రీతిలో ఏపీ ప్రజలు కూడా బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబు చెంప చెల్లుమనిపించారని వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోటీ చేసి ఏపీ ప్రజలను మభ్యపెట్టాలని ఆయన ప్రయత్నించారని, కానీ తెలంగాణ ప్రజలు ఆయనకు గట్టిగా బుద్ధిచెప్పారని అన్నారు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తెలంగాణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడించాలని చంద్రబాబు నీతులు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్లతో పాటు వైసీపీ మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి, వర ప్రసాద్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీలు రాజ్యసభలో ఆందోళనకు దిగారు. హోదాను డిమాండ్ చేస్తూ సభలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీకాకుళంపై విరుచుకుపడిన తిత్లీ తుపాను విషయంలో కేంద్ర సాయంపై చర్చించాలంటూ రూల్ 377 కింద శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నోటీసు ఇచ్చారు.