Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో రోజూ దద్దరిల్లిన ఉభయ సభలు
- కాసేపటికే వాయిదా పడిన రాజ్యసభ, లోక్సభ
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మూడో రోజూ రాఫెల్ స్కాంకు వ్యతిరేక ఆందోళనలు కొనసాగాయి. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. కాంగ్రెస్, టీడీపీ, శివసేన, అన్నాడీఎంకే, సీపీఐ(ఎం), ఎన్సీపి, ఆర్జేడి సభ్యులు ఉభయసభల్లో ఆందోళన చేపట్టారు. రాఫెల్ ఒప్పందంపై జేపీసీ వేయాలన్న నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభల్లో తీవ్ర గందరగోళం నెల కొంది. లోక్సభ రెండు సార్లు వాయిదా పడి రెండో సారి ఏకంగా శుక్రవారానికి వాయిదా పడగా, రాజ్యసభ మాత్రం ఒకేసారి శుక్రవారానికి వాయిదా పడింది. రెండు సభల్లో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు.
తొలుత లోక్సభను ప్రారంభించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను నిర్వహించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్, అన్నాడీఎంకే, టీడీపీ, శివసేన ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్సీపీ, సీపీఐ(ఎం), టీఎంసీ, ఆర్జేడీ, ఆప్ తదితర పార్టీల సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో లోక్సభ రెండుసార్లు వాయిదా పడింది. ఆందోళన సమయంలో మైక్ను లేపి ప్లకార్డును ప్రదర్శించినందుకు గానూ టీడీపీ ఎంపీ మాగంటి బాబును స్పీకర్ హెచ్చరించారు. సభ వాయిదా అనంతరం టీడీపీ సభ్యులను తన ఛాంబర్కు పిలిపించుకుని స్పీకర్ మాట్లాడారు. కాసేపటికి తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ఆందోళనలు సద్దుమణగలేదు. దీంతో లోక్సభను సుమిత్రా మహాజన్ శుక్రవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఆందోళనలు కొనసాగాయి. గజ, తిత్లీ తుఫాను పరిహారంపై తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే, డీఎంకే నిరసనలు తెలపడంతో చైర్మెన్ వెంకయ్యనాయుడు సభను శుక్రవారానికి వాయిదా వేశారు. కాంగ్రెస్, ఆప్, సీపీఐ(ఎం), టీఎంసీ గురువారం లోక్సభ, రాజ్యసభలో రాఫెల్ ఒప్పందంపై వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. కానీ చైర్మెన్ చర్చకు అనుమతించలేదు.