Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి అధికారాన్ని దూరం చేశాయా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితమేదైనప్పటికీ.. ఒక విషయం ప్రస్ఫుటమైంది. హిందీ బెల్టు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో గ్రామీణ, దళిత ఓటర్లు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. వారి అసంతృప్తి కాంగ్రెస్కు అనుకూలంగా, విశ్వసనీయంగా మారింది.
గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న బీజేపీ
న్యూఢిల్లీ : ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం రైతు అసంతృప్తి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లోని మొత్తం 424 గ్రామీణ స్థానాల్లో బీజేపీ 153 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2013లో ఇదే ప్రాంతాల్లో బీజేపీ గెలుచుకున్న స్థానాలు 294. అంటే దాదాపు 50 శాతం సీట్లు తగ్గాయి. రాష్ట్రాలవారీగా బీజేపీకి తగ్గిన స్థానాలను ఒకసారి పరిశీలిస్తే..
మధ్యప్రదేశ్
2014 నుంచి మధ్యప్రదేశ్లో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అది కూడా పంట దిగుబడి బాగానే ఉన్నప్పటికీ రైతులు సమస్యల ఊబిలోకి నెట్టేయబడ్డారు. పంట ధరలు కుప్పకూలడంతో కనీస మద్దతు ధర కూడా లభించక అప్పుల్లో కూరుకుపోయారు. ఎన్నికల ఫలితాలు వారి ఆగ్రహాన్ని చాలా స్పష్టంగా ప్రతిబింబించాయి. బీజేపీకి గ్రామీణ ప్రాంతంలో 2013లో 122 స్థానాలుండగా 2018లో ఈ సంఖ్య 84కు పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్కు గ్రామీణ సీట్ల సంఖ్య 56 నుంచి 95కు పెరిగింది.
రాజస్థాన్
రాజస్థాన్లో కూడా రైతుల అసంతృప్తి, రుణ మాఫీ ప్రక్రియ అమలులో ఆలస్యం, రైతు ఉత్పత్తుల సేకరణలో అలసత్వం బీజేపీని దెబ్బతీశాయి. ఫలితంగా 2013లో బీజేపీకి ఉన్న గ్రామీణ స్థానాలు 131 నుంచి 2018లో 56కు పడిపోయాయి. వారి అసంతృప్తిని కాంగ్రెస్ క్యాష్ చేసుకోగలిగింది. 2013లో కాంగ్రెస్కు వున్న గ్రామీణ అసెంబ్లీ స్థానాల సంఖ్య 18 కాగా, ప్రస్తుత ఎన్నికల్లో 83 సీట్లు దక్కాయి.
ఛత్తీస్గఢ్
గ్రామీణ ఓటర్ల నుంచి బీజేపీకి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది ఈ రాష్ట్రంలోనే. మూడో వంతు కంటే ఎక్కువగా గ్రామీణ స్థానాలను బీజేపీ ఛత్తీస్గఢ్లో కోల్పోయింది. 2013లో ఆ పార్టీకి గ్రామీణ సీట్లు 41 ఉండగా, 2018లో గెలిచింది కేవలం 13 మాత్రమే. 2013లో వున్న 35 స్థానాలనుంచి కాంగ్రెస్ 2018కి 58కి పెంచుకోగలిగింది.
ఎస్సీ స్థానాల్లో ఇలా...
షెడ్యూల్డ్ కులాల కోసం రిజర్వ్ చేసిన అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ బాగా దెబ్బతిన్నది. బీజేపీ సిట్టింగ్ స్థానాలు కాంగ్రెస్ కైవసమయ్యాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 78 ఎస్సీ రిజర్వుడ్ సీట్లు ఉండగా.. 2013లో బీజేపీ 68 సీట్లలో విజయం సాధించింది. 2018లో సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీ 31 స్థానాలకు పడిపోయింది. 2018లో 78 ఎస్సీ స్థానాలకుగాను కాంగ్రెస్ 43 స్థానాలను తన అకౌంట్లో వేసుకోగలిగింది.
మూడు రాష్ట్రాల్లో
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు ఎస్సీ సీట్లు 4 కాగా, 2018కి వాటి సంఖ్య 17కు చేరింది. 2013లో బీజేపీ 28 స్థానాలుండగా ప్రస్తుతం 18 సీట్లు లభించాయి.
అదేవిధంగా, రాజస్థాన్లో 2013లో కాంగ్రెస్కు ఒక్క స్థానం కూడా లేదు. 2018లో 19 సీట్లను గెలుచుకుంది. బీజేపీకి స్థానాలు ఇక్కడ గణనీయంగా పడిపోయాయి.
ఛత్తీస్గఢ్లో ఎస్సీ రిజర్వుడు స్థానాలకు కాంగ్రెస్కు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్కు 2013లో ఒకే ఒక్క ఎస్సీ రిజర్వుడ్ సీటులో గెలుపొందగా ప్రస్తుతం 7 స్థానాల్లో విజయం సాధించింది. 2013లో 9 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2018లో రెండు సీట్లు మాత్రమే గెలుపొందింది.ఇటీవల చోటుచేసుకున్న రైతు ఉద్యమాలు, వెనుకబడిన తరగతులు ఆందోళనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇదే ధోరణిని సూచిస్తున్నది. ఇటీవల ఓ మీడియా సంస్థ జరిపిన సర్వే ప్రకారం.. బీజేపీకి రైతు మద్దతు 2017లో ఉన్న 49శాతం నుంచి ఈ ఏడాది మే నాటికి 37 శాతం పడిపోయింది. ఇదే కాలంలో బీజేపీకి దళితుల మద్దతు 33శాతం నుంచి 22శాతానికి క్షీణించింది. ఆ తర్వాత జరిగిన దళిత ఉద్యమాలను బట్టీ చూస్తే బీజేపీ గ్రాఫ్ మరీ పడిపోయి ఉంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. బీజేపీపై ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ విజయం సాధించవచ్చు.. కానీ, దానిని ఆ పార్టీ నిలబెట్టుకుంటుందా? రైతుల అన్ని సమస్యలకూ రుణమాఫీ పరిష్కారంలా చూస్తున్నారు. వారి ప్రాథమిక సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదు. అదే జరిగితే.. ప్రభుత్వాలు మారతాయి తప్ప.. వారి జీవిత చక్రంలో ఎలాంటి మార్పూ ఉండబోదు. దేశానికి అన్నంపెట్టే రైతును విస్మరిస్తే.. ఏ ప్రభుత్వానికైనా ఇదే గతి తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.