Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్లో లింగ వివక్ష రూపుమాపేందుకు సంస్కరణలు చేపట్టాలని యూనిసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒమర్ అబ్ది తెలిపారు. లింగ వివక్ష కారణంగా దేశాభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. బీహార్ రాజధాని పాట్నాలోని ఓ చిన్నారుల క్లినిక్ గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వైద్యం కోసం బాలికలను క్లీనిక్కు తీసుకెళ్లాలంటే తల్లిదండ్రులు తటపటాయిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు బాలికల వైద్య ఖర్చులు భరించలేకపోవడం ఆందోళనకరమన్నారు. వైద్య ఖర్చులు చెల్లించుకోలేకపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. ప్రస్తుత సమాజం ఎన్నో ఒడిదొడుకులు, సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నదని అన్నారు. అనేక రాష్ట్రాల్లో నిరక్షరాస్యత శాతం ఎక్కువగా ఉందన్నారు. దేశ ప్రగతికి విద్య దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన అవసరమన్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ దక్కాలంటే సమాజంలో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించేందుకు ప్రతీ ఒక్క సంస్థ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో బాలికలు వివక్షకు గురవుతుండటం ఆందోళనకరమని అన్నారు. బాలికల అక్షరాస్యత శాతం పెంపొందించేందు కోసం యూనిసెఫ్ కొంతకాలంగా కృషి చేస్తోందన్నారు. బాల, బాలికల మధ్య తారతమ్యాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తోందన్నారు. లింగ వివక్ష రూపుమాపేందుకు ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ (ఈసీడీ) కార్యక్రమాన్ని ప్రవేశపెటిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ఈసీడీ పట్ల ఆరోగ్య శాఖ సిబ్బందిలోనూ సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఒమర్ అబ్ది తెలిపారు. శిశువు జన్మించినప్పటి నుంచి వెయ్యిరోజుల వరకు అత్యంత కీలక సమయంగా పరిగణిస్తామని అన్నారు. ఈ సమయంలో శిశువు శారీరక వికాసంతోపాటు మేథస్సు క్రమక్రమంగా పెంపొందుతుందన్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధి కోసం ఈసీడీ కారక్రమం పట్ల విస్తృత అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు యూనిసెఫ్ నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విస్తరించేందుకు ఆరోగ్య శాఖ సహకారం తీసుకుంటున్నామని అన్నారు. ఈసీడీ కార్యక్రమం ద్వారా లింగ వివక్ష రూపుమాపవచ్చని ఒమర్ అబ్ది తెలిపారు. -