Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న ఒంగోలు-కాకినాడమధ్యలో తీరం దాటే అవకాశం
- రైతుల ఉరుకులు- పరుగులు
- అప్రమత్తమవుతున్న అధికార యంత్రాంగం
విజయవాడ: ఆగేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది శ్రీలంకలోని ట్రింకోమాలీకి తూర్పు దిశగా 670 కిలోమీటర్ల దూరంలోనూ, తూర్పు, ఆగేయ దిశలో చెన్నైకి 930 కిలోమీటర్లు దూరంలోనూ, మచిలీపట్నంకు ఆగేయంగా 1090 కిలోమీటర్లు దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర, వాయువ్య దిశగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం 24 గంటల్లో ఇది తుపానుగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 36 గంటల్లో అంటే దాదాపుగా సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారి ఒంగోలు-కాకినాడ మధ్యలో తీరాన్ని తాకే అవకాశముందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి కోస్తా అంతటా జల్లులు ప్రారంభమై సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాస్తవానికి శనివారం నాటికే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రానికి దూరంగా ఆగేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం శుక్రవారం ఉదయం 8.30 నుండి 11.30 వరకు కదలకుండా స్థిరంగా ఉండిపోయినట్టు అధికారులు చెప్పారు. తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత కాస్త కదలిక వచ్చిందన్నారు. గంటకు 6 నుంచి 7, లేదీ 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోందన్నారు. ప్రస్తుత కదలికను బట్టి ఒంగోలు- కాకినాడ మధ్యలో కదులుతుందని అంచనా ఉన్నా, తుపానుగా మారిన తర్వాతే దాని దిశ, తీరాన్ని తాకే ప్రదేశంపై స్పష్టత వస్తుందని అధికారులంటున్నారు. నెమ్మదిగా పయనిస్తుండటంతో ఆదివారం తుపానుగా మారుతుందని, కావున ఆ రోజునుండే బలమైన గాలులు, కోస్తాలోని అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయంటున్నారు. ప్రస్తుతం తీరం వెంబడి ఈశాన్యం నుంచి గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. తుపానుగా మారకముందే సముద్రంలో ఉండే మత్స్యకారులు ఒడ్డుకు చేరుకోవాలని, లేదంటే దగ్గర్లోని పోర్టుల్లోకి చేరుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి తీరంలో అలల ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.పెథాన్ తుపాను ముప్పు గుంటూరు జిల్లాకూ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరు, తెనాలి, రేపల్లె, బాపట్లతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. అధికారుల సూచనలతో రైతులూ ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఓదెల మీదున్న వరిని కుప్పలు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి జిల్లాలో ధాన్యం నూర్పిడిలు వేగంగా ప్రారంభమయ్యాయి. పత్తికాయలు, పగిలిన కాయలు, తీయడానికి సిద్ధంగా ఉన్న పత్తి వర్షాలు పడితే తీవ్ర నష్టమని రైతులు భయపడుతున్నారు.