Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిజోరంలో నేడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 17న
- ఛత్తీస్గఢ్ సీఎంపై తొలగని ప్రతిష్టంభన
ఐజ్వాల్ : మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరేందుకు ముహూర్తం ఖరారైంది. మిజోరంలో ఘన విజయం సాధించిన మిజోరం నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఎంఎన్ఎఫ్ చీఫ్ జొరంతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శనివారం మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఐజ్వాల్లోని రాజ్భవన్లో ఆయనతో పాటు పలువురు.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్నది. జొరంతగా 1998 నుంచి 2008 వరకు సీఎంగా పని చేశారు. కాగా.. రాష్ట్రంలో తొలిసారి క్రైస్తవ ఆచారం ప్రకారం ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎంఎన్ఎఫ్ ఎమ్మెల్యే లాల్రువాట్కిమా వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ మొత్తం 40 స్థానాలకుగానూ 26 సీట్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అటు మధ్యప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ ఈనెల 17న(సోమవారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం భోపాల్లోని లాల్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతున్నది. సీఎం పదవి కోసం కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింథియా పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవర్ని ఎంచుకోవాలన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేసి కమల్నాథ్కు జై కొట్టింది. కాగా.. కమల్నాథ్ను ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆహ్వానించారు. మరోవైపు.. ఛత్తీస్గఢ్ సీఎం ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
అనుభవానికే అధికార పగ్గాలు
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్
యువనేత సచిన్ పైలట్కు డిప్యూటీ..
జైపూర్ : రాజస్థాన్ నయా సీఎం ఎవరనే దానిపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. జూనియర్, సీనియర్ మధ్య జరిగిన రసవత్తర రేసు కాస్త ఉద్రిక్తతలకు దారి తీసి వాతావరణాన్ని వేడెక్కించింది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ అనుచరులు వారి నేతలకు మద్దతుగా గురువారం ఆందోళనలు కూడా చేపట్టారు. కాగా.. ముఖ్యమంత్రి ఎంపిక కోసం ఢిల్లీ కేంద్రంగా కసరత్తు బాగానే జరిగింది. అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం.. అనుభవజ్ఞుడికే జై కొట్టింది. రాజకీయాల్లో ఆరితేరిన అశోక్ గెహ్లాట్కే ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతూ కాంగ్రెస్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నది. యువనేత సచిన్ పైలట్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రాజస్థాన్లో కాంగ్రెస్కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టడంలో వీరిద్దరూ అవిశ్రాంతంగా కృషి చేశారు. అటు.. మధ్యప్రదేశ్లోనూ కాంగ్రెస్ హైకమాండ్ అనుభవానికే ప్రాధాన్యతనిస్తూ సీనియర్ నేత కమల్నాథ్ను సీఎంగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా.. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ సోమవారం నాడు మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నది. గెహ్లాట్ తాజా ఎన్నికల్లో సర్దార్పురా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాజస్థాన్లోని జోథ్పూర్లో 1951 మే 3న జన్మించిన గెహ్లాట్.. ఎంఏ ఎకానమిక్స్ విద్యను పూర్తి చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక పదవులు సమర్థవంతంగా నిర్వహించిన ఆయన.. ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. 1998 నుంచి 2003 వరకు, 2008 నుంచి 2013 వరకు రెండుదఫాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. గెహ్లాట్.. ఐదుసార్లు లోక్సభ ఎంపీగా గెలుపొందారు. అంతేకాక ఇందిరాగాంధీ, రాజీవ్, పివి నర్సింహారావు హయాంలో పలు కేంద్ర శాఖలకు మంత్రిగా వ్యవహరించారు.