Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో 11 మంది మృతి
- 80 మందికి పైగా ఆస్పత్రిపాలు..
- విషతుల్యం చేసినట్టు అనుమానం
బెంగళూరు : ఆలయం వద్ద కలుషితమైన ప్రసాదం తినడంతో 11 మంది భక్తులు మృతి చెందగా.. 80 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన కర్నాటకలోని చమరాజ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. భక్తులకు అందించిన ప్రసాదం(ఆహారం)లో ఎవరో కావాలనే విషం కలిపి ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు, భక్తుల వివరాల ప్రకారం.. చమరాజ్నగర్లోని సలీవాడీ గ్రామంలో ఉన్న కిచూమారాండా ఆలయం వద్ద శుక్రవారం.. భక్తులకు టమాటాలతో చేసిన ఆహారపదార్థాన్ని ప్రసాదంగా ఇచ్చారు. ఇది తిన్న కాసేపటికే భక్తులకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించి 11 మంది మృతి చెందారు. అస్వస్థతకు గురైన భక్తులు చమరాజ్నగర్, మైసూర్ జిల్లాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమకు ఇచ్చిన ఆహారం పాయిజన్ వాసన వచ్చిందని, అయినాగానీ ప్రసాదమన్న భావనతో తిన్నామని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భక్తుడొకరు వెల్లడించారు. భక్తులకిచ్చిన ప్రసాదం నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబోరేటరీకి పంపించినట్టు జిల్లా అధికారి ఒకరు వెల్లడించారు. ఘటనపై కర్నాటక సీఎం కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాదంలో ఎవరో కావాలనే విషం కలిపినట్టు వార్తలొస్తున్నాయని, సమగ్ర విచారణ అనంతరం దోషులను ఎంతటివారైనా విడిచిపెట్టబోమని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.