Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాల పట్టు..
- మోడీ సర్కారు నిరాకరణ
- స్తంభించిన ఉభయసభలు... సోమవారానికి వాయిదా
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నాలుగో రోజూ కూడా అదే సీన్లు పునరావృతమయ్యాయి. రాఫెల్ ఒప్పందంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. అధికార, ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ, రాజ్యసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం స్పీకర్ సుమిత్రా లోక్సభను ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. రాఫెల్పై కాంగ్రెస్... విభజన హామీలపై టీడీపీ... కావేరిపై అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. కాగా, సీపీఐ(ఎం), ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. రాఫెల్ డీల్ను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా విచారణ జరపాలన్న పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించిన నేపథ్యంలో అధికార బీజేపీ సభ్యులు కూడా ఆందోళన చేపట్టారు. రాఫెల్పై జేపీసీ వేయాలని, చర్చ జరిపించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయగా, అధికార బీజేపీ సభ్యులు రాఫెల్ ఒప్పందంపై అసత్య ప్రచారాలు చేసినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. రాహుల్, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. స్పీకర్ ఎన్నిసార్లు వారించినా... సభ్యులు ఆందోళన విరమించలేదు. సభ్యులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు పెద్ద ఎత్తున చేసుకోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను కొద్దిసేపటి వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత కూడా రాఫెల్పై చర్చను కోరుతూ ప్రతిపక్ష నేతలు ఆందోళనను కొనసాగించడంతో స్పీకర్ సోమవారానికి సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన మధ్యే ప్రభుత్వం కొన్ని బిల్లులను ప్రవేశపెట్టింది. అనంతరం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరోపణలన్నీ నిరాధారమైనవి అన్నారు. ఈ విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతున్నామని, ఇప్పుడు కోర్టు కూడా అదే విషయం చెప్పిందని అన్నారు. ''రాఫెల్ ఒప్పందం సుస్పష్టంగా ఉంది. రాజకీయ లబ్ది కోసం రాహుల్ దేశ పరువు తీశారు. వెంటనే ఆయన పార్లమెంటుకు, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి'' అని డిమాండ్ చేశారు. అందుకు ప్రతిస్పందనగా, ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. సభ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కొనసాగుతూనే ఉంటుందని, యుద్ధ విమానాల ధరల విషయం తమ పరిధిలో లేదంటూ దానిపై వ్యాఖ్యానించడానికి సుప్రీం నిరాకరించిందని స్పష్టం చేశారు. అయితే, హోంమంత్రి అసంపూర్ణమైన తీర్పుపై మాట్లాడుతున్నారని చెప్పారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే తంతూ కొనసాగింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో గందరగోళం నెలకొంది. దీంతో సభ సోమవారం నాటికి వాయిదా పడింది. అనంతరం కాంగ్రెస్ ఉపనేత ఆనంద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఒప్పందంలోని అనేక ముఖ్యమైన విషయాల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, తాము ఇప్పటికీ జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నామని అన్నారు.