Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ:రక్షణ రంగంలో లాజిస్టిక్ సరఫరాకు భారత్, రష్యా త్వరలోనే అంగీకారం కుదుర్చుకోనున్నాయి. ఒప్పందంలో భాగంగా ఒకరి సదుపాయాలను మరొకరు వినియోగించుకునే వీలు కలుగుతుంది. ఒప్పందం వల్ల యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఇంధనాన్ని నింపుకోవడం, మరమ్మతులు జరుపుకోవడంలాంటి విషయాల్లో ఒకరి మౌలిక వసతుల్ని మరొకరు వాడుకునే అవకాశముంటుంది. ఇదే తరహా ఒప్పందాల్ని భారత్ ఇప్పటికే అమెరికా, సింగపూర్తో కుదుర్చుకున్నది.
మిలిటరీ,సాంకేతిక సహకారంపై ఢిల్లీలో జరిగిన 18వ భారత్-రష్యా అంతర్గత ప్రభుత్వ కమిషన్ సమావేశంలో ఇరు దేశాలు లాజిస్టిక్స్ ఒప్పందంపై సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఈ సమావేశంలో భారత రక్షణమంత్రి నిర్మలాసీతారామన్, రష్యా రక్షణమంత్రి జనరల్ సెర్గేయి షోయిగు పాల్గొన్నారు. ఏకే-103 అస్సాల్ట్ రైఫిళ్లను ఉమ్మడిగా తయారు చేయడంపైనా ఇరు దేశాల అధికారులు చర్చించారు. ప్రస్తుతం మిలిటరీ ఉపయోగిస్తున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఏకే-103లను ప్రవేశపెట్టనున్నట్టు ఓ అధికారి తెలిపారు. భారత్,రష్యా రక్షణ సహకారంపై ఇరు దేశాల జాతీయ సలహాదారులు(ఎన్ఎస్ఏలు) ఈ సందర్భంగా ప్రత్యేక చర్చలు జరిపారు. రక్షణ అంశాల్లో సుదీర్ఘకాలంపాటు సహకారమందించిన రష్యాతో సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు భారత్ మరోసారి ఆసక్తి చూపడంపై పలు దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రస్తుత తరుణంలో అమెరికా, రష్యాల పట్ల సమతుల్య సంబంధాలను భారత విదేశాంగశాఖ తన వ్యూహంగా అనుసరిస్తోంది.