Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) డిమాండ్
న్యూఢిల్లీ : జ్యుడీషియల్ విధుల నుండి జస్టిస్సేన్ను తొలగించాల్సిందిగా సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. శుక్రవారం ఇక్కడ సమావేశమైన సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో ఈ మేరకు ఒక ప్రకటన విడుదలచేసింది. మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదీప్ రంజన్ సేన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. మన రాజ్యాంగం మౌలిక స్వరూపానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యలు వున్నాయని పేర్కొంది. ఇతర స్వభావాలతో పాటుగా లౌకికవాదం అనేది మన రాజ్యాంగంలో ప్రాధమిక లక్షణంగా వుండాలని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పేర్కొందని గుర్తుచేసింది. హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలన్న ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా జస్టిస్ సేన్ తన రాజకీయ విశ్వాసాన్ని ప్రతిబింబించారని పొలిట్బ్యూరో పేర్కొంది. దేశ విభజనపై తన దారుణమైన మతతత్వ అభిప్రాయాన్ని వెల్లడించడం ద్వారా, పౌరసత్వ చట్టానికి ప్రతిపాదిత సవరణపై రాజకీయ ప్రకటన చేయడం ద్వారా ఆయన, రెండు అంశాలను విస్మరించారని, పార్లమెంట్కు గల ప్రముఖ పాత్రను, న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బ తీశారని పొలిట్బ్యూరో విమర్శించింది. ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఈశాన్య ప్రాంత ప్రజల్లో అసంతృప్తి మరింత పెచ్చరిల్లడానికి దోహదపడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సేన్ కొనసాగే నైతిక హక్కు ఎంత మాత్రమూ లేదని సీపీఐ(ఎం) స్పష్టం చేసింది. న్యాయమూర్తిని తొలగించాలని కోరుతూ ఆయనపై అభిశంసన తీర్మానాన్ని తీసుకువచ్చే అంశంపై పార్లమెంట్లోని ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని పేర్కొంది. ఈ లోగా జస్టిస్ సేన్ను జ్యుడీషియల్ విధుల నుండి దూరంగా వుంచేలా ఆదేశాలు జారీ చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరింది.