Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూతురిపై రెండేండ్లుగా అఘాయిత్యం
- ఆపై చంపి.. పూడ్చిపెట్టిన కసాయి
కోల్కతా : కన్నతండ్రే కసాయిగా మారాడు. రెండేండ్లుగా కూతురుపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. వాడి ఘాతుకాన్ని భరించలేని ఆ మైనరు గ్రామస్థులకు విషయం చెబుతానంటూ హెచ్చరించింది. ఇక తన బండారం ఎక్కడ బయటపడుతుందనుకున్నాడో ఏమో... ఆ కసాయి ఉగ్రరూపం దాల్చాడు. కూతుర్ని చంపేశాడు.. ఆపై ఇంట్లో పూడ్చిపెట్టాడు.. పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఈ అతి దారుణమైన ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. కలింపాంగ్ జిల్లా జల్దాక ప్రాంతంలో శుక్ర బహదుర్ ప్రధాన్ (45) భార్య రెండేండ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి తండ్రి వద్దే ఉంటుంది కూతురు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కసాయిగా మారాడు. 11 ఏండ్ల బాలికపై 2016 నుంచి అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. కాగా, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ బాలిక తల్లడిల్లిపోయింది. రెండేండ్లు అతడి అఘాయిత్యాలను భరించిన ఆమె.. ఇక తన జోలికి వస్తే గ్రామస్థులకు చెబుతానని తండ్రిని బెదిరించింది. ఇక తన బండారం బయటపడుతుందనుకున్నాడు. ఈ నెల 9న ఆమెను హత్యచేశాడు. బాలిక కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారు అతడిని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకుందని, పూడ్చిపెట్టానని చెప్పాడు. అనుమానంతో సమీప బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాధితురాలి శవాన్ని తవ్వితీసిన పోలీసులు పోస్టు మార్టం నిర్వహించారు. తండ్రి మీద అనుమానంతో అతడిని విచారించగా.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే భయానక నిజాలు అతడి నోటి నుంచి వెలువడ్డాయి. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి.. కటకటాల వెనక్కి పంపారు.