Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి మిత్రపక్షం జేడీ(యూ) షాక్
పాట్నా: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీకి.. బీహార్లో మిత్రపక్షమైన జేడీ(యూ) మరో షాక్ ఇచ్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బీజేపీ ఆర్డినెన్స్ తీసుకువస్తే దానికి మద్దతివ్వబోమని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీ(యూ) స్పష్టం చేసింది. సంఘపరివారంతోపాటు బీజేపీలోని కొన్ని శ్రేణులు రామ మందిర నిర్మాణంకోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జేడీ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ రామచంద్ర ప్రసాద్ సింగ్ ఈ మేరకు స్పష్టం చేశారు. గతంలో తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఆయన శుక్రవారం తెలిపారు. 'రామమందిరం కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలనే ఆలోచనను ఆమోదించేది లేదు. ఒకవేళ పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకువచ్చినా దానికి మద్దతునిచ్చేది లేద'ని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి ఇరువర్గాలు చర్చించి పరిష్కరించుకోవాలి, లేదా న్యాయస్థానమే పరిష్కారించాలనే అభిప్రాయానికి లోబడి ఉన్నామని చెప్పారు. 'అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్టీ వైఖరిపట్ల ప్రజలు గందరగోళపడాల్సిన పనిలేదు. ఈ విషయమై ఆర్డినెన్స్కు మద్దతివ్వబోమని' ఆయన వివరించారు. 2014 తో పోల్చితే బీజేపీ ఆకర్షణ తగ్గిపోయిందని అన్నారు. కాగా, జేడీ(యూ) నేత రామమందిరంపై బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆర్టికల్ 370, అయోధ్యలో రామమందిరం, యూనిఫాం సివిల్కోడ్లు పొత్తు ఎజెండాలో ఉండకూడదని జేడీ(యూ) మొదట్లోనే బీజేపీపై ఒత్తిడి చేసింది. బీహార్లో బీజేపీ, జేడీయూల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.