Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్లో ప్రారంభించిన సుప్రీంకోర్టు జడ్జీ లోకూర్
- దేశంలోనే తొలిసాలిగా తెలంగాణలో అమలు
- బాధితులకు త్వరగా న్యాయం చేకూరుతోందన్న న్యాయమూర్తి
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలోనే తొలిసారిగా పోలీసులు, కోర్టుల మధ్య ఆన్లైన్ డేటా మార్పిడి విధానానికి రాష్ట్రంలో శనివారం అంకురార్పణ జరిగింది. ఇన్నర్ ఆపరేటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్(ఐసీజేఎస్) క్రింద వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసు స్టేషన్ నుంచి జిల్లా కోర్టుకు మధ్య ఆన్లైన్ డేటా మార్పిడి విధానానికి ఐసీజేఎస్ చైర్మెన్ కూడా అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ లోకూర్ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా తెలంగాణలో ఐసీజేఎస్ విధానానికి అంకురార్పణ జరిగిందని అన్నారు. ఇక్కడ ఈ విధానం అమలవుతున్న తీరును బట్టి దేశంలోని అన్ని రాష్ట్రాలకు అంచెలంచెలుగా విస్తరిస్తామని తెలిపారు. తొలుత ఎఫ్ఐఆర్, చార్జిషీట్లను పోలీసుస్టేషన్ నుంచి సంబంధిత కోర్టుకు ఆన్లైన్లో సమాచారం వెళ్తుందని, దానికి సంబంధించిన రశీదు సైతం కోర్టు నుంచి ఇస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం వలన పోలీసుస్టేషన్ల నుంచి కోర్టుకు, కోర్టుల నుంచి దర్యాప్తు అధికారులకు అందవలసిన సమాచారంలో జరుగుతున్న అమితమైన జాప్యానికి తెరపడుతుందని జస్టిస్ లోకూర్ అన్నారు. ఆన్లైన్లో సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం ద్వారా పోలీసు, ఫోరెన్సిక్ విభాగం, ప్రాసిక్యూషన్, కోర్టులలో డేటా తగిన సమయంలో చేరి బాధితులకు సత్వరంగా న్యాయం చేకూర్చడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాలలో కేసుల విచారణ ఏ దశలో ఉంది, దర్యాప్తు అధికారుల నుంచి ఏ మేరకు అవసరమైన డేటా ఆయా కేసులకు సంబంధించి కోర్టులకు అందుతున్నాయి మొదలైన అంశాలను ఆన్లైన్ విధానం ద్వారా సక్రమంగా పర్యవేక్షించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు ముందున్నారని ఆయన మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఐసీజేఎస్ను పైలెట్ ప్రాజెక్టుగా వరంగల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ పోలీసులు కోర్టుల మధ్య డేటా మార్పిడి వలన తీర్పులు వెలువరించడం మరింత వేగవంతం అవుతుందని అన్నారు. రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఐసీజెఎస్ విధానంతో పోలీసు, ప్రాసిక్యూషన్, న్యాయవవ్యస్థలు మరింత పారదర్శకంగా సాగడానికి వీలవుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సీసీటీఎన్ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు జరుపుతున్నామని, ఈ ప్రాజెక్టును కూడా రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసు ఐటీ విభాగం అధికారుల పని తీరు ప్రశంసనీయమని అన్నారు. తొలుత ఎఫ్ఐఆర్లు, ఛార్జిషీట్లు ఆన్లైన్లో కోర్టులకు చేర్చడం జరుగుతుందని రెండవ ఫేజ్లో కోర్టుల నుంచి అవసరమైన వారెంట్లు, జడ్జిమెంట్లు, తదితరమైన సమాచారం పోలీసు స్టేషన్లకు అందుతుందని ఆయన వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ కాప్, ఫిషియల్ రికాగ్నైజేషన్ సిస్టమ్ మొదలైనవి దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రారంభించామని అన్నారు. రాష్ట్ర పోలీసు ఐటీ విభాగం అదనపు డీజీ డాక్టర్ రవిగుప్తా మాట్లాడుతూ ఆన్లైన్లో సమాచార మార్పిడి, డేటా ూర్పిడి విధానాన్ని అంచెలవారీగా రాష్ట్రంలోని ఇతర పోలీసు స్టేషన్లకు విస్తరిస్తామని తెలిపారు.