Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సముద్రంలో పెరిగిన అలల ఉధృతి
- మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరాన్ని తాకే అవకాశం
- పలు జిల్లాలకు ప్రత్యేక బృందాలు
- ఆందోళనలో అన్నదాతలు
విశాఖ: ఆగేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం సాయంత్రానికి నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం శ్రీలంకలోని ట్రింకోమాలీకి తూర్పు-ఈశాన్యంగా 440 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకి తూర్పు-ఆగేయంగా 590 కిలోమీటర్లు, మచిలీపట్నంకు దక్షిణ-ఆగేయంగా 770 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైనట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 24 గంటల్లో తీవ్ర వాయుగుండం బలపడి తుఫానుగా మారుతుందని, తర్వాత మరో 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని పేర్కొంది. ఉత్తర, వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం - కాకినాడల మధ్య సోమవారం మధ్యాహ్నం తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తోంది. శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం ఉదయానికి తుపానుగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కోస్తాలో బలమైన ఈదురుగాలులు ఈశాన్య దిశ నుండి వీస్తున్నాయన్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు ప్రారంభమవుతాయన్నారు. ఆదివారం తుపానుగా మారాక గాలుల వేగం పెరుగుతుందని, గంటకు 100 నుంచి 117 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. సోమ, మంగళవారం కోస్తా అంతటా జల్లులు పడతాయని, తీరం తాకే జిల్లా, దాని పరిసర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం ఒకట్రెండు చోట్ల జల్లులు పడతాయని, సోమ, మంగళవారాలు మోస్తరు జల్లులు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందన్నారు. తుఫానుగా మారాక అలల ఎత్తుకు ఎగిసి పడతాయన్నారు. రాష్ట్రంలోని నిజాంపట్నం, మచిలీపట్నం, విశాఖ పోర్టుల్లో కృష్ణపట్నం మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు కార్తికేయమిశ్రా, కాటంనేని భాస్కర్ వివిధ శాఖల అధికారులతో పలు దఫాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తీరం ఎక్కడ దాటుతుందో పూర్తిగా అంచనా వేయలేకపోతున్నట్టు ఆయన ప్రాథమికంగా వివరించారు. తిత్లీ తుఫాను సందర్భంగా అక్కడ స్పెషల్ అధికారులుగా సమర్ధవంతంగా పనిచేసిన నలుగురు ఐఎఎస్ అధికారులను ఇక్కడ నియమించామన్నారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో సెలవులు ప్రకటించినట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు. పలు ప్రయివేటు విద్యాసంస్థలు కూడా సెలవులు ప్రకటించాయి. కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన కాకినాడ కలెక్టరేట్లో 1800 425 3077 టోల్ ఫ్రీ అందుబాటులో ఉంటుంది. కాకినాడ డివిజన్ కార్యాలయంలో 0884 2368100, పెద్దాపురం డివిజన్ కార్యాలయంలో 08852 241254, అమలాపురం డివిజన్ కార్యాలయంలో 08856 233100, రాజమహేంద్రవరం డివిజన్లో 0883 2442344ను ఏర్పాటు చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
'తిత్లీ' నుంచి తేరుకోకముందే..
శ్రీకాకుళం జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. జిల్లాలో మబ్బుల వాతావరణం నెలకొనడంతో పాటు గాలులు కూడా వీస్తున్నాయి. తిత్లీ తుఫాను నుంచి ఇంకా తేరుకోక ముందే మరో తుఫాను వస్తుందన్న హెచ్చరికలతో తీరప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వరి కోతలు కోసిన రైతులు భయాందోళనలు చెందుతున్నారు. మరోవైపు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సముద్ర తీర ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లావ్యాప్తంగా చలిగాలులు, తీర ప్రాంత మండలాల్లో గాలుల వేగం పెరిగాయి.
ప్రకాశం జిల్లాలో కలెక్టర్ వాడరేవు వినరు చంద్ ఆధ్వర్యంలో అధికారులు తీర ప్రాంత మండలాలలో పరిస్ధితులను పర్యవేక్షిస్తున్నారు. టంగుటూరు, సింగరాయకొండతో పలు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఒంగోలు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్ఫ్రీ నెంబర్ 1077, 08592-281400 నెంబర్ల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన 4 పడవలు రావాల్సి ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావంతో చలిగాలులు వీస్తున్నాయి.