Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాఫెల్ డీల్పై కమిటీకి ససేమిరా
- సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయమేనా?
- 70ఏండ్లలో 8సార్లు జేపీసీ.. తర్వాతి ఎన్నికల్లో ఐదుసార్లు అధికారపార్టీ పరాజయం
న్యూఢిల్లీ: మోడీ సర్కారుకు జేపీసీ గుబులు పట్టుకుంది. విపక్షాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినా జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసేం దుకు ససేమిరా అంటున్నది. గతంలో జేపీసీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు.. తర్వా త జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాభవానికి గురైన దృష్టాంతాలను దృష్టిలో పెట్టు కునే మోడీ సర్కారు జంకుతున్నదా? అని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. అంతేకాదు జేపీసీ దర్యాప్తు తిరిగి ప్రధాని మెడకు చుట్టుకుంటుందా? అని కూడా విశ్లేషిస్తున్నారు. పార్లమెంటులో శీతాకాల సమావేశాలు మొదలై నాలు గు రోజులు గడిచాయి. కానీ, ఈ నాలుగు రోజుల్లో రెండు సభల్లో సజావుగా సమావేశాలు జరిగింది లేదు. దానికి కారణం రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పం దమే. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలన్నీ రాఫెల్ డీల్పై జేపీసీ ఏర్పాటు చేసి దర్యా ప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు మోడీ సర్కారు అంగీకరించడం లేదు. జేపీసీ వేయకుండా ఈ అంశంపై రెండు సభల్లోనూ చర్చించేందుకు సిద్ధమని చెబుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాఫెల్ డీల్ జరిగిన ప్రక్రియలో అనుమానించదగ్గదేమీ లేదని, దర్యాప్తు అనవసరమని చెబుతూ సుప్రీంకోర్లు వెలువరించిన తీర్పు ప్రభుత్వంలో ఉత్సాహాన్ని నింపింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ ప్రెస్కాన్ఫరెన్స్లో జేపీసీ ఏర్పాటుపై పునరుద్ఘాటించారు. అసలు మోడీ సర్కారు జేపీసీ ఏర్పాటు చేయడంలో ఎందుకు సంకోచిస్తున్నదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
70ఏండ్లలో ఎనిమిది జేపీసీలు:
ఇప్పటివరకు 70 ఏండ్ల పార్లమెంట్ చరిత్రలో పలుకారణాలతో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదిసార్లు జేపీసీని ఏర్పాటు చేసింది. కాగా, ఇందులో ఐదుసార్లు జేపీసీని ఏర్పాటు చేశాక తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ పరాజయాన్ని చవిచూసింది. మొదటిసారిగా 1987లో బోఫోర్స్ కుంభకోణంపై అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేయగా.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. 1992లో పివి నర్సింహ రావు ప్రభుత్వం సెక్యూరిటీ, బ్యాంకింగ్ ట్రాన్సక్షన్లలో అక్రమాలపై జేపీసీ వేయగా.. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైంది. 2003లో వాజ్పేయి ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేయగా.. తర్వాతి ఎన్నికల్లో ఆ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టలేదు. కాగా, ఆశ్చర్యకరంగా మన్మోహన్ సింగ్, మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం హయాంలో రెండుసార్లు జేపీసీని ఏర్పాటు చేశాయి. 2011లో 2జీ స్పెక్ట్రం, 2013లో వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే.
కమిటీపై ఎందుకు వెనుకడుగు?
ఎవరినైనా దర్యాప్తు చేసే అధికారాలు కలిగి ఉన్న జేపీసీ.. రాఫెల్ ఒప్పందంతో నేరుగా ప్రమేయమున్న ప్రధానినీ ప్రశ్నించవచ్చు. ఇది మోడీ సర్కారును మరిన్ని చిక్కుల్లో పడేయవచ్చు. కాగా, మోడీ సర్కారు హయాంలో వేసిన రెండు జేపీసీలు కుంభకోణాలు, అవినీతి దర్యాప్తు కోసం కాదనేది గమనార్హం. రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై జేపీసీ వేయడం మోడీ సర్కారుకు తలనొప్పిగానే మారనుంది. కాగా, ఒకవేళ రాఫెల్ డీల్పై జేపీసీ వేస్తే.. ఈ నివేదికను మూడు నెలల్లోనే అందజేయాల్సి ఉంటుంది. అంటే సరిగ్గా లోక్సభ ఎన్నికల ముంగిట్లో రిపోర్టును పార్లమెంటుకి సమర్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే జేపీసీని ఏర్పాటు చేసేందుకు మోడీ సర్కారు మొండికేస్తున్నదని చర్చ జరుగుతున్నది.
జేపీసీ అంటే ...
జాయింట్ పార్లమెంటరీ కమిటీని సీరియస్ అంశాలపై దర్యాప్తుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పార్లమెంటులోని రెండు సభల ఎంపీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ దర్యాప్తుకు సంబంధించి ఏ వ్యక్తినైనా, సంస్థనైనా విచారించవచ్చు. కమిటీ వేసిన మూడు నెలల్లో నివేదికను పూర్తి చేయాల్సి ఉంటుంది. జేపీసీ ముందు హాజరయ్యేందుకు నిరాకరించినవారిని పార్లమెంటును ధిక్కారించినవారుగా పరిగణిస్తుంది. సభల్లో మెజార్టీ ఉన్న పార్టీ సభ్యులే కమిటీలోనూ మెజార్టీగా ఉంటారని నిపుణుడు పిడిటి ఆచారి తెలిపారు. సాధారణంగా అధికారపార్టీ సభ్యులే జేపీసీలో మెజార్టీగా ఉండటంతో నిర్ణయం ప్రభుత్వానికి అనుకూలంగానే పోతుంటుంది. ఉదాహరణకు 2జీ కుంభకోణంపై వేసిన జేపీసీ రిపోర్టులో అప్పటి మన్మోహన్ ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చింది. కానీ తర్వాత కోర్టులో కుంభకోణం నిరూపితమైంది. అటు తర్వాత 2014లో కాంగ్రెస్ పరాజయం పాలైంది.