Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేఘాలయ హైకోర్టు జారీపై ఎడిటర్స్ గిల్డ్ తీవ్ర అసంతృప్తి
న్యూఢిల్లీ: ది షిల్లాంగ్ టైమ్స్ ఎడిటర్ ప్యాట్రికా ముఖిమ్, పబ్లిషర్ శోభా చౌదరికి మేఘాలయ హైకోర్టు సమన్లు జారీ చేయడంపై ఎడిటర్స్ గిల్డ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు తమకూ, తమ కుటుంబసభ్యులకు వారికివారే బహుళ సౌకర్యాలు, ప్రయోజనాలను ఎలా మంజూరు చేసుకుంటారంటూ ఆ పత్రికలో వచ్చిన వార్తను కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ హైకోర్టు వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. కోర్టుకు స్వయంగా హాజరు కావాలని ఎడిటర్, పబ్లిషర్ను ఆదేశించింది. రిటైర్డ్ జడ్జిలు, వారి కుటుంబాలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఈ నెల 10న షిల్లాంగ్ టైమ్స్ ఓ కథనం రాసింది. దీనిపై స్పందించిన మేఘాలయ హైకోర్టు జడ్జి సుదీప్రంజన్సేన్ ఈ ఆదేశాలిచ్చారు. హైకోర్టు ఆదేశాలపై ఎడిటర్స్ గిల్డ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో న్యాయవ్యవస్థ ఒకటని, స్వతంత్రంగా నిష్పాక్షికంగా విధులు నిర్వహించే మీడియాకు అండగా ఉండాలని ఎడిటర్స్ గిల్డ్ సూచించింది.
జడ్జి సుదీప్రంజన్సేన్ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. జనాభారీత్యా భారత్ను ఇప్పటికే హిందూ దేశంగా ప్రకటించాల్సి ఉన్నదంటూ జడ్జి చేసిన వ్యాఖ్యలు విమర్శలపాలయ్యాయి. దేశ విభజన అనంతరం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకున్నదని, భారత్ కూడా హిందూ రాజ్యంగా ప్రకటించుకోవాల్సి ఉండేదన్నారు. కానీ, అప్పటి మన పాలకులు ప్రజాస్వామ్య, లౌకిక దేశాన్ని ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. భారత్ ఇస్లామిక్ దేశంగా మారేందుకు వీల్లేదన్నారు. పాకిస్థాన్,బంగ్లాదేశ్,అఫ్ఘానిస్థాన్ నుంచి వలస వచ్చే హిందువులు, ముస్లిమేతరులు, గిరిజనులకు భారత పౌరసత్వం దక్కేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకు గడువు తేదీ అనేది అవసరంలేదని అన్నారు. ఓ వ్యక్తికి నివాస ధ్రువీకరణ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించిన కేసులో జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు.