Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్లో అత్యధిక ఓట్లు సాధించిన ముస్లిం ఎమ్మెల్యే
- మంత్రి పదవి దక్కితే రికార్డే
జైపూర్: రాజస్థాన్లోని ముస్లింలలో అత్యంత వెనకబడిన సామాజిక వర్గాలలో ఒకటైన మేవాతీ తెగ నుంచి ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే జహిదా ఖాన్ త్వరలో చరిత్ర సృష్టించనున్నారు. రాష్ట్రంలో త్వరలో కొలువుదీరనున్న అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే మేవాతి తెగ నుంచి మంత్రి పదవి పొందిన తొలి వ్యక్తిగా ఆమె నిలవనున్నారు. ఈ సందర్భంలో ఆమె నేపథ్యం ఆసక్తి కలిగిస్తోంది. అల్వార్, భరత్పూర్ జిల్లాలలో అధికంగా ఉన్న మేవాతి తెగకు చెందిన ప్రజలు సామాజికంగా, ఆర్థిక, రాజకీయ రంగాలలో వెనక్కి నెట్టివేయబడ్డవారు. వీరిలో అక్షరాస్యత కూడా అంతంతమాత్రమే. ఇదే తెగకు చెందిన జహిదా ఖాన్ మాత్రం ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం ఆమె తన సొంత జిల్లా భరత్పూర్లోని కమాన్ నియోజకవర్గం నుంచి 2008లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్నుంచి ఆమె వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. ఆమె, మేవాతి తెగ నుంచి గెలుపొందిన తొలి మహిళా ఎమ్మెల్యే కాగా, ఆలిండియా మహిళా కాంగ్రెస్కు జనరల్ సెక్రటరీగా నియమితులైన మొదటి మహిళ. ఈ ఎన్నికలలో ఆమె తన ప్రత్యర్థిపై దాదాపు 40 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో ఆమెకు 1 లక్షా పదివేల ఓట్లు పోలయ్యాయి. ఇది కూడా ఓ రికార్డే. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్తో పాటు మరెవ్వరికీ ఇన్ని ఓట్లు రాలేదు. దీనిపై జహిదా స్పందిస్తూ.. తమ వర్గం వెనకబాటుతనానికి విద్య లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. ఈ సమస్యను నిర్మూలించడానికి తాను కృషిచేస్తున్నానని చెప్పారు. మహిళలకు విద్య పట్ల అవగాహన కల్పించడం, చిన్న పిల్లలకు విద్య నేర్పించడంపై తగినన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. తన కూతురు షెహనాజ్ ఖాన్ (కమాన్ సర్పంచ్) కూడా మహిళా విద్య పట్ల అవగాహన కల్పిస్తున్నదని వివరించారు. ఈ ప్రాంతంలో ఉన్న 200 గ్రామాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని.. ఈ సమస్యకు కూడా పరిష్కారం ఆలోచిస్తున్నామని తెలిపారు. గోరక్షణ పేరిట అల్వార్లో ముస్లింలపై జరుగుతున్న దాడులపై స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని, సమాజంలో ఇలాంటి వాటికి చోటులేదని స్పష్టం చేశారు.