Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిషా వైపు పయనం
- 16 మంది మృతి
- లక్షల ఎకరాల్లో నేలకొరిగిన పంటలు
కాకినాడ: పెథాయ్ తుఫాను తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద సోమవారం మధ్యాహ్నం 1.30గంటలకు తీరాన్ని తాకి మూడున్నర గంటల ప్రాంతంలో ఒడిషా వైపు పయనించింది. ఆదివారం రాత్రి నుండి సోమవారం సాయంత్రం వరకూ కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో లక్షల ఎకరాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. వరి బాగా దెబ్బతింది. మిర్చి, మొక్కజొన్న, పప్పుదినుసులు, పత్తి, అరటి, పచ్చి మిర్చి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జనజీవనం స్తంభించింది. అన్ని వయస్సుల వారూ చలి తీవ్రతను తట్టుకోలేకపోయారు. వివిధ కారణాలతో 16 మంది మృతి చెందారు. అలాగే బలమైన ఈదురుగాలులు వీచడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయమేర్పడి గాఢాంధకారం నెలకొంది. రైళ్లు, విమానాలు, బస్సులు రద్దు కావడంతో వేలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్- విజయవాడ-కాకినాడ-విశాఖపట్నం మార్గాల్లో నడిచే జన్మభూమి, రత్నాచల్, సింహాద్రిసహా 50 రైళ్లను రద్దు చేశారు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని చెపుతున్నారు. అలాగే రాజమండ్రి-విశాఖ-శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో అనేక బస్సు సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్-విశాఖ, విశాఖ-చెన్నరు-న్యూఢిల్లీ-విశాఖ మధ్య నడిచే విమానాల రాకపోకలు నిలిచి పోయాయి. విశాఖలఓ దిగకుండానే వెనక్కి వెళ్లిపోయాయి. ఎగువ నుంచి వరదనీరు భారీస్థాయిలో చేరుకోవడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకో వడంతో 7వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. భీకరంగా దూసుకొస్తోందని, జిల్లాకు ముఖ్యంగా కోనసీమకు పెను ముప్పు తప్పదని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు భయం భయంగా గడిపారు. అనేకచోట్ల చెట్లు నేలకొరిగాయి. యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో ఒక పూరిపాకపై కొబ్బరిచెట్టు కూలడంతో ఆ ఇంట్లో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరం మండలాల్లో గాలులకు చెట్లు నేలకొరిగాయి. జిల్లావ్యాప్తంగా 8,750 ఎకరాల్లో ఖరీఫ్ పంట కోత, పనదశలోనే ఉండిపోయింది. 3062 ఎకరాల్లో నారుమడులు నీటమునిగాయి. 1500 ఎకరాల్లో పొగాకు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. విశాఖలో ఉదయం నుండే ఈదురు గాలులతో పాటు చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు 3 నుంచి 4 మీటర్ల ఎత్తుకు ఎగిశాయి. సముద్రం దాదాపుగా 30 అడుగుల ముందుకు చొచ్చుకొచ్చింది. భీమిలి నియోజకవర్గంలోని మంగమూరిపేట మత్స్యకారులకు చెందిన బోట్లు దెబ్బతిన్నాయన్న సమాచారం అందుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నారు. పెదబయలు, తదితర వారపుసంతలకు వ్యాపారులు, గిరిజనులు రాక బోసిపోయాయి. కాకినాడ కేంద్రంగా సముద్రంలో చేపలు వేటకు వెళ్లిన ఎస్.రాయవరం మండలం కె.పోలవరానికి చెందిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో 1300 హెక్టార్లలో వరి నీటమునిగినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా కోసిన వరి చేను 25 వేల హెక్టార్ల వరకు వర్షానికి తడిచిపోయినట్టు తెలిసింది. అరటి, తమలపాకులు, కూరగాయాల పంట 740 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. విజయవాడలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు కూడా చెరువులను తలపించాయి. పలు పల్లపు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు చర్యలు తీసుకోవాలని భానునగర్లో ప్రజలు ధర్నా చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ముందు జాగ్రత్తగా కృష్ణాజిల్లా పెనమలూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఉయ్యూరు మండలాల్లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తహశీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో 21 వేల ఎకరాల్లో కోతలు కోసి, నేలకొరిగిన వరి పంట నీటిలో నానుతోంది. 1.12 లక్షల అపరాల పంట నీటిలో ఉంది. గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో లక్షన్నర ఎకరాల్లో వరి పైరు నెలకొరిగింది. 50 వేల ఎకరాల్లో వరి కోసి పనలపై ఉండగా తడిసిపోయింది. ధాన్యం రంగు మారే పరిస్థితేర్పడింది. జిల్లాలో అత్యధికంగా చుండూరు, పివి పాలెం, వేమూరు, నిజాంపట్నం, కొల్లూరు, అమృతలూరు తదితర ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేట వద్ద సముద్రం 20 అడుగుల ముందుకొచ్చింది. తుపాను గాలులు బలంగా వీయడంతో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపల కంచేరు వద్ద లంగరు వేసిన 23 బోట్లు, ముక్కాం వద్ద ఒక బోటు బోల్తా పడి సముద్రంలో కొట్టుకుపోయి సుమారు రూ.1.15 కోట్లు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలిపారు.
ప్రాణాలు తోడేసిన చలిగాలులు
వివిధ కారణాలతో రాష్ట్రంలో 16 మంది మృతి చెందారు. చలిగాలుల తీవ్రతతో 13 మంది, పంటలు నష్టపోయి గుండెపోటుతో ఇద్దరు, కొండచరియ విరిగి ఒకరు మృతిచెందారు. వరి పైరు నేలకొరగడంతో తట్టుకోలేక గుంటూరు జిల్లా పివి పాలెం మండలం జిఎన్ పాలెంలో పొలం వద్దే కౌలురైతు గంజిపోయిన శ్రీనివాసరావు (45), కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం రామకోటిపురం గ్రామానికి చెందిన కౌలురైతు బడే శ్రీనివాసరావు(42) గుండెపోటుతో మృతిచెందారు. విజయవాడ క్రీస్తురాజుపురంలో కొండచరియ విరిగిపడి దుర్గారావు అనే వ్యక్తి మృతిచెందాడు.
తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లిపాలేనికి చెందిన రెల్లివలసల వీరమ్మ (68), మంజేరుకు చెందిన పుణ్యమంతుల అప్పారావు (76), కుయ్యేరుకు చెందిన జంపన సుభద్రమ్మ (53), తాళ్లరేవు మండలం బొడ్డువానిలంకకు చెందిన బొడ్డు సత్యనారాయణ (42), ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన మట్టపర్తి రంగయ్య (75), గొల్లవిల్లి పంచాయతీ వాడపర్రుకు చెందిన మట్టపర్తి సైదులు (72), పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తకాయలతిప్ప గ్రామానికి చెందిన లక్కు వెంకటనర్సప్ఫ(80), పేరుపాలెం పంచాయతీ దిండ్లపల్లవపాలెంకు చెందిన తిరుమాణి మహాలకీë(60), నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామానికి చెందిన తిరుమాని ముసలమ్మ(70), చీరాల ఒకటో వార్డు ఐక్యనగర్లో దుడ్డు వెంకాయమ్మ(73), నూనె కుమారి(61), వేటపాలెం మండలం బస్ షెల్టర్లో పేరు తెలియని యాచడొకరు, గుంటూరు జిల్లా పివి పాలెం మండలం అల్లూరులో కోనేటి మహాలక్ష్మీ (98) మృతి చెందారు.