Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీకర్కు అందజేసిన సీపీఐ(ఎం) ఎంపీ
- రాహుల్పై నోటీసులిచ్చిన బీజేపీ నేత ఠాకూర్
- ట్రాన్స్జెండర్ బిల్లుకు లోక్సభఆమోదం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
రాఫెల్ డీల్కి సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉభయ సభలు సోమవారం హౌరెత్తాయి. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీలు సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాలు స్పీకర్కు అందజేశాయి. భారత సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారమిచ్చినందుకు ప్రధాని, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్పై (ప్రివిలేజస్ మోషన్) నోటీసులిచ్చినట్టు ఆ పార్టీల నేతలు తెలిపారు. తొలుత ప్రధాని మోడీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్పై సీపీఐ(ఎం) లోక్సభ పక్షనేత కరుణాకరన్ స్పీకర్ సుమిత్రా మహజన్కు సభా హక్కుల నోటీసులు ఇచ్చారు. రక్షణ శాఖ తరఫున గానీ, కాగ్ తరఫున గానీ పార్లమెంట్లో భాగమైన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ )కి ఎలాంటి నివేదికలు సమర్పించలేదని నోటీసులో పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పులోని పేరా నెంబర్ 25లో మాత్రం పీఏసీకి నివేదిక సమర్పించిన విధంగా ఉండటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తామిచ్చిన నోటీసులపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. కోర్టుకు తప్పుడు సమాచారం అందించిన ప్రభుత్వంపై సభా హక్కుల తీర్మానం మేరకు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాఫెల్ ఒప్పందంలో జరిగిన అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని వేయాలన్నారు. ప్రతిపక్ష, అధికార పక్షాలకు చెందిన ఎంపీలతో కమిటీ వేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని అందులో పేర్కొన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో రాఫెల్ ఒప్పంద ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళతామని హెచ్చరించారు. ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపీలు కెేసీ వేణుగోపాల్, సునీల్ జాఖర్లు కూడా ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. మరోవైపు రాజ్యసభలో ఆర్జేడి ఎంపీ మనోజ్ ఝా అటార్నీ జనరల్పై సభ హక్కుల నోటీసులను చైర్మెన్ వెంకయ్యకి ఇచ్చారు. అయితే, రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు.
లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు
ట్రిపుల్ తలాక్ బిల్లును సోమవారం లోక్సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యతిరేకించారు. ఇది ఒక ప్రత్యేక మతాన్ని లక్ష్యంగా చేసుకొని ఉన్నదని, అందుకే ఇది రాజ్యాంగ విరుద్ధమని థరూర్ అన్నారు. వెంటనే కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ బిల్లులో అవసరమైన సవరణలు జరిగాయని, ట్రిపుల్ తలాక్ సమస్యను ఎదుర్కొంటున్న ముస్లిం మహిళలకు సహాయం చేసేందుకు ఈ చట్టం అవసరమని తెలిపారు.
ట్రాన్స్జెండర్ బిల్లు ఆమోదం
ట్రాన్స్ జెండర్స్ హక్కుల రక్షణ బిల్లు-2016ను లోక్సభ ఆమోదించింది. కేంద్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి తావర్చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ 2016లోనే లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టామని, తరువాత స్టాండింగ్ కమిటీకి పంపామని సభకు వివరించారు. 2017లో సవరణలు లేకుండా మళ్లీ సభలో ప్రవేశపెట్టామని చెప్పారు. గెహ్లాట్ 27 సవరణలను సభ ప్రతిపాదించినట్టు గుర్తు చేశారు. సీపీఐ(ఎం) ఎంపీ బద్జ్రు ఖాన్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్స్కు రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే క్రీడల్లో కూడా రిజర్వేషన్లు అనుమతించాలని కోరారు. కాంగ్రెస్ సభ్యులు శశిథరూర్ మాట్లాడుతూ ప్రస్తుతం 41 సవరణలు అవసరమని అన్నారు. బిల్లు అసంపూర్ణంగా ఉందని, అందులో ట్రాన్స్జెండర్స్ నిర్వచనం లోపం ఉందని అన్నారు. ఒక వ్యక్తి ట్రాన్స్ జండరా? కాదా? అనేది నిర్ణయించడానికి ఓ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామనడం, సంబంధిత వ్యక్తిని అపహాస్యం చేయడమేనని అన్నారు. ఈ బిల్లు వివాహాలు, విడాకులు, వారసత్వంపై మౌనంగా ఉన్నందున కేంద్రమంత్రి ఈ బిల్లును ఉపసంహరించుకొని, ట్రాన్స్జెండర్వర్గానికి న్యాయం చేసేందుకు సరికొత్త బిల్లులను తీసుకురావాలని సలహా ఇచ్చారు. బీజేడీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ మాట్లాడుతూ స్క్రీనింగ్ కమిటీ తిరస్కరిస్తే, ఆ వ్యక్తి పున:పరిశీలన కోసం ఎవరినీ ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. సరవణలు ఎక్కువ వస్తున్నాయి కనుక, మంత్రిత్వ శాఖ మరో బిల్లును ఎందుకు తీసుకురాకూడదూ? అని అన్నారు. ట్రాన్స్జెండర్ కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు.
రాజ్యసభలో కొనసాగిన ఆందోళన
రాజ్యసభ కార్యకలాపాలకు వరుసగా ఐదోరోజూ కూడా అంతరాయం కలిగింది. సోమవారం సభ ప్రారంభమయ్యాక రాఫెల్ ఒప్పందం, కావేరీ సమస్యలపై సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో కొద్ది నిమిషాలకే చైర్మెన్ వెంకయ్య సభను మంగళవారానికి వాయిదా వేశారు. కర్నాటక, తమిళనాడు మధ్య ఉన్న నీటి వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు వెల్లోకి వెళ్లి నినాదాలు చేశారు. మరోవైపు రాఫెల్ ఒప్పందంలో సుప్రీం కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని, ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీఆజాద్ డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే తాము నోటీసు ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ నిరసనలతో రాజ్యసభ పలుమార్లు వాయిదాపడింది. కాగా, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ నలంద యూనివర్సిటీ(సవరణ) బిల్లు-2013ను ఉపసంహరించుకున్నారు. తొలుత ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ పోటీలో షట్లర్ పివి సింధూ బంగారు పతకం సాధించడంపై రాజ్యసభ అభినందనలు తెలిపింది.