Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలకు ముందు కూటమికి అవకాశంలేదు
- రాఫెల్పై జేపీసీ వేయాల్సిందే
- ఆర్బీఐ ప్రతిష్టంభనకు మోడీ సర్కారే కారణం
- తాజా ఎన్నికల ఫలితాల్లో ప్రజావ్యతిరేకత ప్రస్ఫుటం:మీడియా సమావేశంలో సీతారాం ఏచూరి
నవ తెలంగాణ - న్యూ ఢిల్లీ బ్యూరో
ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని 2019 ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. అందుకు అవసరమైన ఎన్నికల వ్యూహాలను అవలంభిస్తామన్నారు. డిసెంబర్ 15,16వ తేదీల్లో ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో చర్చించిన కీలక అంశాలను సోమవారం ఆయన మీడియాకు తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడిందన్నారు. దాంతో ఆర్బీఐ వద్ద ఉన్న నిధులు లాక్కోవడానికి మోడీ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తుందన్నారు. అయితే ఆ నిర్ణయం ఆర్బీఐ స్వతంత్రతకు భంగం కలిగే విషయమన్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే జరిగిందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో మత భావాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ మరోసారి ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ను ప్రచారానికి తీసుకెళ్ళడం ఆ చర్యల్లో భాగమేనన్నారు. హిందూత్వ ఓట్లను సంఘటిత పరుచుకునేందుకు మోడీ సర్కారు తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. అయితే, కాంగ్రెస్ కూడా హిందూత్వతో రాజీ పడుతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాఫెల్ డీల్పై ప్రభుత్వం సుప్రీంకోర్టును పూర్తిగా తప్పుదొవ పట్టించిందని విమర్శించారు. ఈ విషయం తీర్పును అధ్యయనం చేసిన ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుందన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జేపీసీని తిరస్కరించడంపై ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ప్రజాస్వామ్య సంస్థకు పార్లమెంటే అంతిమం అని పునరుద్ఘాటించారు. అటువంటి వ్యవస్థను కేంద్రమంత్రి ఏ విధంగా అనుమానాలు వ్యక్తపరిచి తిరస్కరించగలరని ప్రశ్నించారు. రాఫెల్ డీల్ ఒప్పందాల ద్వారా బీజేపీ పెద్ద ఎత్తున బాండ్లను సేకరించిందని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు రూ. 220 కోట్ల మేర ఎన్నికల బాండ్లను బీజేపీ స్వీకరించినట్టు తెలిపారు. ఈ చర్యలు చూస్తుంటే, రాజకీయ అవినీతిని మోడీ సర్కారు చట్టబద్ధం చేసినట్టు అనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు, ముస్లిం, గిరిజన, ఆదివాసీలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటి నుంచే బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. అభివృద్ధికి సంబంధించిన రాజకీయాలు, చర్చ చేయాలని కోరారు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజల్లో వ్యతిరేకతను ప్రస్ఫుటం చేస్తున్నాయని అన్నారు. రాజస్థాన్లో కిసాన్ సభ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే, తెలంగాణ సీట్లు, ఓట్లు గత ఎన్నికల కంటే తగ్గడంపై లోతుగా చర్చించినట్టు వివరించారు. తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ తాజా ఎన్నికల ఫలితాలపై ప్రాథమిక నివేదిక అందజేసిందన్నారు. పూర్తిస్థాయిలో నివేదిక మరిన్ని రోజుల్లో అందజేస్తుందని వివరించారు.
సిక్కు ఊచకోత కీలక పాత్రధారి సజ్జన్ జీవితకాల శిక్షపై ఏచూరి హర్షం
1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లలో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్కు ఢిల్లీ హైకోర్టు జీవితకాల శిక్షను విధించడంపై ఏచూరి హర్షం వ్యక్తం చేశారు. అయితే, మత ఘర్షణలకు సంబంధించిన కేసుల విచారణ ఆలస్యం కావడం మంచిదికాదని అన్నారు. అమాయకుల ఆర్తనాదాలకు త్వరతిగతిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. గోధ్రా, ముజఫర్నగర్ అల్లర్లకు సంబంధించిన కేసుల విచారణ వేగవంతంగా చేసి దోషులకు శిక్ష విధించేలా చేయాలని పేర్కొన్నారు.