Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జార్ఖండ్లో చిన్నారులకిచ్చే
- గుడ్ల సంఖ్యను తగ్గించిన బీజేపీ సర్కారు
రాంచీ: ఆకలి చావులతో ఓ వైపు జార్ఖండ్లోని జనం పిట్టల్లా రాలిపోతుంటే వారికి పోషకాహారం అందించాల్సిన సర్కారు ఆ అభాగ్యులపై ఏమాత్రం కనికరం చూపడం లేదు. అంతేగాక మధ్యాహ్న భోజనంలో భాగంగా చిన్నారులకిచ్చే గుడ్ల సంఖ్యను సైతం అక్కడి బీజేపీ సర్కారు తగ్గించింది. జార్ఖండ్లో అంగన్వాడీ, పాఠశాలల్లో చదివే చిన్నారులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా వారానికి మూడు సార్లు ఇవ్వాల్సిన కోడి గుడ్ల సంఖ్యను రెండుకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ నేతృత్వంలోని సర్కారు నిర్ణయించింది. దీంతోపాటు వారికి అందించే గుడ్డు ధరను రూ. 4 నుంచి రూ. 6 కు పెంచింది. గత కొన్ని రోజులుగా జార్ఖండ్లోని గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆకలి సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేషన్ కూడా అందలేని స్థితిలో ఆకలిచావులకు గురయ్యారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలో 2015-16లో సరైన పోషకాహారం లేని పిల్లలు 35.8 శాతం మంది ఉంటే జార్ఖండ్లో అది 47.8 శాతంగా నమోదైంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఇరవై మందికి పైగా పౌరులు ఆకలికి అలమటించి చనిపోయారు. గణాంకాలు ఆందోళనకు గురిచేస్తున్నా బీజేపీ సర్కారు మాత్రం మొద్దు నిద్రను వీడడం లేదు. జార్ఖండ్తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ మధ్యాహ్న భోజనంలో పిల్లలకు గుడ్డును సరిగా ఇవ్వడం లేదని సర్వేల ద్వారా వెల్లడైంది. త్రిపురలోనూ చిన్నారులకు ఇచ్చే గుడ్ల సంఖ్యను బీజేపీ సర్కారు తగ్గించింది. కాగా, జార్ఖండ్ సర్కారు నిర్ణయంపై 'రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్' నిర్వహిస్తున్న అష్రాఫీనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోడిగుడ్లలో ఉండే ప్రోటీన్ల వల్ల పిల్లల్లో ఎదుగుదల ఉంటుందని.. అలాంటి గుడ్డును వారానికి ఆరుసార్లు ఇవ్వాల్సింది పోయి వాటిని కుదించడం దారుణమన్నారు. ఈ ప్రభావం పిల్లల మీద పడే ప్రమాదముందన్నారు. గుడ్లను సప్లై చేస్తున్న కిసాన్ ఫౌల్ట్రీ ఫామ్ (కెపీఎఫ్.. ఇది తమిళనాడుకు చెందిన క్రిస్టీ ఫ్రెడ్జ్గ్రమ్ ఇండిస్టీకి షెల్ కంపెనీగా ఉంది) కూడా అక్రమాలకు పాల్పడుతున్నదని అన్నారు. పిల్లలకు ఇచ్చే గుడ్లలో చాలావరకు నాసిరకానికి చెందినవేనని ఆరోపించారు. సదరు కాంట్రాక్టరుకు కాంట్రాక్టు రద్దు చేసి చిన్నారులకు నాణ్యమైన గుడ్లను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.