Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండురోజుల అధ్యయనం తర్వాత ప్రెస్మీట్ పెడతా:
- సామాజిక కార్యకర్త అన్నాహజారె
న్యూఢిల్లీ: రాఫెల్పై తన దగ్గర చాలా పత్రాలు ఉన్నాయని సామాజిక కార్యకర్త అన్నాహజారె అన్నారు. వాటిపై 2రోజులు పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ప్రెస్మీట్ పెడతానని తెలిపారు. రైతులు, అవినీతి నిరోధక బిల్లు విషయంలో తన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చక పోవడంతో ఈనెల 30 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్టు తాజాగా మంగళవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...లోక్పాల్ బిల్లు అమలులో ఉండిఉంటే రాఫెల్ వంటి కుంభకోణాలు జరిగి ఉండేవి కావన్నారు. ఒప్పందానికి నెల రోజుల ముందు ఏర్పాటు చేసిన కంపెనీని అందులో భాగస్వాములను ఎలా చేశారో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. లోక్పాల్ బిల్లును అమలు చేస్తామని, రైతులకు 1.5రెట్లు మద్దతుధర కల్పిస్తామని గతంలో కేంద్రం తనకు మోసపూరిత వాగ్దానాలను చేసిందని చెప్పారు. ఇకపై అటువంటి వాగ్దానాలను నమ్మబోనని స్పష్టం చేశారు. దీనిపై తనకు ప్రాణమున్నంత వరకు నిరాహార దీక్ష చేస్తానన్నారు. ఈ దీక్షకు రాష్ట్రీయ కిసాన్ మహాపంచాయత్ తన మద్దతు ప్రకటించింది. దేశంలోని 15 రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున రైతులు ఈ దీక్షలో పాల్గొంటారని ఆ సంఘం నాయకులు తెలిపారు. కాగా గతేడాది మార్చిలో తన మద్దతుదారులతో కలిసి ఆయన వారం రోజుల నిరహారదీక్ష చేసిన సంగతి తెలిసిందే.