Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏం చేయగలను...
- రాజీవ్ ప్రతాప్ రూడీ వ్యాఖ్యలపై శత్రుఘ్నసిన్హా
న్యూఢిల్లీ : అతనిపై(బీజేపీ అధికార ప్రతినిధి ప్రతాప్ రూడీ) సానుభూతి వ్యక్తం చేయటం తప్ప...ఏం చేయగలను... అంటూ బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు నా పాత స్నేహితుడే, అతడిపై పార్టీ అధినాయకత్వం ఒత్తిడి ఉందని, బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీని ఉద్దేశించి ట్విట్టర్లో సిన్హా వ్యాఖ్యలు చేశారు. ''నిజం చెప్పటమే తిరుగుబాటు అనుకుంటే...నేను తిరుగుబాటుదారుడ్నే...''అంటూ బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా కోల్కతా సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వంపై సిన్హా చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో సిన్హా తీరును తప్పుబడుతూ బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ పలు వ్యాఖ్యలు చేశారు. పార్టీ సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటుందనీ రూడీ ప్రకటించారు. దీనిపై తాజాగా ట్విట్టర్ వేదికగా సిన్హా స్పందించారు. ఈ సందర్భంగా సిన్హా ఏమన్నారంటే..''అలాంటి వ్యక్తిపై (ప్రతాప్ రూడీ) నేను కేవలం సానుభూతి చూపటం తప్ప ఏం చేయగలను?అధినాయకత్వం నుంచి అతడిపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అతను నాకు పాత స్నేహితుడే. నాపై అతడ్ని ఉసిగొల్పారు. కానీ నేను మాత్రం అతడి శ్రేయోభిలాషినే. అయితే నేను ఒక సలహా మాత్రం చెప్పగలను. వెన్నెముక ఉన్న వ్యక్తుల్లా వ్యవహరించండి...ఎవరో ఒత్తిడి చేస్తే లొంగిపోరాదు. వ్యక్తిగతంగా విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. అతడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా''నని అన్నారు.