Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 56 శాతం నిధులు మోడీ ప్రచారానికే..
- బేటీ బచావో - బేటీ పడావో పేరుకే
- 56 శాతం నిధులు మోడీ ప్రచారానికే...
ఈ పథకం లక్ష్యం చాలా గొప్పది. ప్రచారం జోరుగా సాగింది. మోడీ సర్కార్కు మాత్రం ఆడబిడ్డల గురించిన లక్ష్యాలను సాధించడంకన్నా.. ప్రచార ఆర్భాటమే ప్రధానంగా మారిందా? నిధుల కేటాయింపులు పరిశీలిస్తే.. ఇదే వాస్తవమని స్పష్టమవుతున్నది. బాలికాభివృద్ధికి కేటాయించిన నిధులు అంతంత మాత్రమే.. అందులోనూ సగానికిపైగా నిధులు ఎలా దారిమళ్ళాయో ఒక పరిశీలిద్దాం...
న్యూఢిల్లీ : పరస్పర సంబంధమున్న రెండు ప్రధాన లక్ష్యాలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని 2015 జనవరి 22న ప్రారంభించారు. దేశంలో తగ్గుతున్న లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించడం, పరిమాణాత్మకంగా చెప్పాలంటే... 'బాలికలకు సంబంధించి దేశ ప్రజల మైండ్ సెట్ను మార్చడం' ఈ పథకం ప్రధాన లక్ష్యం. మూడు మంత్రిత్వశాఖలు.. మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి ద్వారా ఈ పథకం అమలును మోడీ సర్కార్ చేపట్టింది. నాలుగేండ్ల తర్వాత చూస్తే.. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం దాని ప్రధాన లక్ష్యం ప్రచారమేనని తేలింది. 2014-15 నుంచి 2018-19 వరకు ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో 56 శాతం 'మీడియాకు సంబంధించిన కార్యక్రమాల'కే ఖర్చుచేశారు. దీనికి భిన్నంగా జిల్లాలు, రాష్ట్రాలకు 25శాతం కంటే తక్కువ నిధులు కేటాయించబడ్డాయి. మరీ విచిత్రమేమంటే.. కేటాయించిన నిధుల్లో 19శాతం వరకూ విడుదలకు కూడా నోచుకోలేదు. ఈ పథకం నిధులకు సంబంధించి అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈ నెల నాలుగున సమాధానం ఇచ్చారు. దాని ప్రకారం.. ఇప్పటివరకూ ఈ పథకానికి ప్రభుత్వం రూ.644 కోట్ల రూపాయలు కేటాయించింది. అందులో కేవలం రూ.159 కోట్లు మాత్రమే జిల్లాలకు, రాష్ట్రాలకు పంపించబడ్డాయి. వైఫల్య పథకంగా దీనిని మీరు చూస్తున్నారా.. అని పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రతికూలంగా స్పందించారు. వాస్తవానికి, దేశంలోని 640 జిల్లాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో పథకం మొదటి దశలో.. లింగ నిష్పత్తి తక్కువ స్థాయిలో వున్న 100 జిల్లాలపై కేంద్రీకరించింది. ఆ తరువాత రెండో దశలో అదనంగా 61 జిల్లాలను ప్రభుత్వం చేర్చిందని చెప్పారు.
ఈ 161 జిల్లాలలో పిల్లల లింగ నిష్పత్తిని పరిశీలిస్తే విజయం పాక్షికమే. ఈ మొత్తం 161 జిల్లాల్లో 2015 నుంచి 53 జిల్లాల్లో లింగ నిష్పత్తి తగ్గింది. ఈ 52లో తొలి దశ 100 జిల్లాల్లో 32, రెండోదశలో చేర్చిన 61 జిల్లాల్లో 21 ఉండటం గమనార్హం. మిగిలిన జిల్లాల్లో పెరిగింది.
కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ తగ్గుదల మరీ ఎక్కువగా ఉంది. ఉదాహరణకు నికోబార్లో 2014-15లో లింగ నిష్పత్తి (ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) 985గా ఉండగా, 2016-17లో 839కు పడిపోయింది. పుదుచ్చేరి యానంలో 2014-15లో 1107 నుంచి 2016-17లో 976కు తగ్గింది. అండమాన్ నికోబార్కు, పురుచ్చేరికి వరుసగా రూ. 55 కోట్లు, రూ. 46 కోట్లను ప్రభుత్వం ఇచ్చింది. ఈ పథక పరిమిత విజయానికి కారణం ప్రభుత్వం నిధులను సమర్థవంతంగా విడుదలచేయకపోవడం ఒక కారణమైతే, విద్య, ఆరోగ్య రంగాల్లో మౌలికవసతుల కల్పనకన్నా.. ఈ పథక ప్రచారానికే ప్రభుత్వం అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 'నిధుల్లో కేటాయింపు చాలా తక్కువ. దాదాపు 5శాతం చొప్పున విద్యా, ఆరోగ్య రంగాలకు కేటాయిస్తున్నారు. ఇంత తక్కువ నిధులతో లక్ష్యాలు ఎలా సాధిస్తారు? ఈ పథకం కింద దీర్ఘకాలిక ఫలితాలను అందించే విద్య, ఆరోగ్య రంగానికి కేటాయింపులు లేవు' అని ఆమె విమర్శించారు.
'సమాజంలో ఆడపిల్లల జనాభా తగ్గిపోతున్నది.. లింగవివక్ష నిర్మూలన కోసం, బాలికల హక్కులు కాపాడటం కోసం బేటీ బచావో-బేటి పడావో పథకాన్ని ప్రారంభిస్తున్నాను. ఆడపిల్లల రక్షణ, గౌరవం కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీనికోసం పెద్దమొత్తంలో నిధిని ఏర్పాటుచేస్తాం'
- ప్రధానమంత్రి మోడీ