Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటో కొనుక్కున్నా జాబ్ వచ్చినట్టేనా ?
- ఈపీఎఫ్తో లింకు పెట్టడం సరికాదు : నిపుణులు
- నిరాధార గణాంకాలతో బురిడీ కొట్టించే యత్నం
నవతెలంగాణ - జనరల్ డెస్క్
యేటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ ఆశలు రేకెత్తించారు. దీంతో అందరికీ జాబులొస్తాయని, బతుకులు బాగుపడుతాయని యువత ఆశించి బీజేపీకి జై కొట్టింది. తీరా మోడీ సర్కారు అధికారంలోకొచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన అటుంచితే.. నోట్లరద్దు, జీఎస్టీ పుణ్యమా అని ఉన్న ఉద్యోగాలు ఊడాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోడీ వితండవాదం చేస్తూ యువతను మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆటో కొనుక్కున్నా.. కాల్ సెంటర్ పెట్టుకున్నా.. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా.. ఉద్యోగాల కల్పన కింద పరిగణించడమే కాక.. ఇదంతా కేంద్రం క్రెడిట్ అంటూ ఆయన గొప్పలు పోతుండటం గమనార్హం. ఈపీఎఫ్, పెన్షన్ స్కీమ్ల నమోదు ఆధారంగా ఉద్యోగాల సృష్టిని అంచనా వేయడమేంటని ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఉద్యోగాలను సృష్టించామని మోడీ చెబుతున్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత నమోదైందని సాక్షాత్తూ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(ఎన్ఎస్ఎస్ఓ) అధ్యయనంలోనే తేలింది. గతేడాదిలో నిరుద్యోగితా రేటు 6.1 శాతంగా నమోదైంది. 1972-73 తర్వాత ఇదే అత్యధిక నిరుద్యోగితా రేటు కావడం గమనార్హం. ఎన్ఎస్ఎస్ఓ రిపోర్టు బయటికి పొక్కకుండా చేసి పరువు పోకుండా చూసుకోవాలన్న కేంద్రం కుయుక్తులు ఫలించలేదు. ఈ నివేదిక ఎట్టకేలకు బయటికి రావడంతో మోడీ సర్కారుకు చెమటలు పట్టినంత పనైంది. నిరుద్యోగితా రేటుపై లేచిన దుమారాన్ని అడ్డుకునేలా బీజేపీ నేతలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి మోడీ ధన్యవాదాలు చెప్పిన సందర్భంగా పొంతన లేని లెక్కలు చెబుతూ ఉద్యోగాల సృష్టిపై ప్రగల్భాలు పలికారు.
పార్లమెంటులో మోడీ ఏం మాట్లాడారు ?
కమర్షియల్ వెహికిల్స్, ఆటోల కొనుగోళ్లు, భవనాల నిర్మాణం, గృహ కార్యకలాపాలు పెరిగాయని, దీన్ని బట్టి చూస్తే అసంఘటిత రంగంలో 80 నుంచి 85 శాతం మేర ఉద్యోగాల సృష్టి జరిగిందని మోడీ చెప్పారు. గడిచిన 15 నెలల్లో 1.8 కోట్ల మంది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)కు దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 64 శాతం మంది 28 ఏండ్ల లోపు వారని తెలిపారు. అంతేకాక.. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉద్యోగుల సంఖ్య 2014 మార్చిలో 65 లక్షలు ఉండగా.. 2018 అక్టోబర్ నాటికి 1.2 కోట్లకు చేరిందని చెప్పారు. దాంతోపాటు 36 లక్షల కమర్షియల్ వాహనాలు, 27 లక్షల ఆటోలు కొత్తగా అమ్ముడయ్యాయని, దీన్నిబట్టి రవాణా రంగంలో 1.25 కోట్ల మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. దాంతోపాటు రెండు లక్షల కాల్ సెంటర్లు కొత్తగా ఏర్పాటయ్యాయని తెలిపారు. కాగా.. వీటన్నింటినీ ఉద్యోగాల కల్పనకు కొలమానాలుగా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాల కల్పనను అంచనా వేసేందుకు అనేక అధ్యయన పద్ధతులున్నా వాటిని పక్కనబెట్టి ఇష్టారీతిన మాట్లాడటమేంటని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో ఎన్ని ఉద్యోగాలను ఇప్పటివరకు సృష్టించారు. ఏ కంపెనీని స్థాపించి ఎంత మందికి ఉపాధి కల్పించారు అన్న విషయాలు మోడీ ప్రసంగంలో ఎక్కడా వినపడక పోవడం గమనార్హం.
ఈపీఎఫ్తో ఉద్యోగాలకు లింకా ?
ఈపీఎఫ్ ఆధారంగా ఉద్యోగాల సృష్టిని అంచనా వేయడాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) సీఈవో మహేశ్ వ్యాస్ తప్పుబట్టారు. ఈపీఎఫ్ కోసం రిజిస్ట్రర్ చేసుకున్నంత మాత్రాన సదరు వ్యక్తి ఉద్యోగం పొందినట్టు కాదని ఆయన తెలిపారు. 'ఉన్న నిబంధనల ప్రకారం..ఏదైనా కంపెనీలో 20, అంతకంటే ఎక్కువ మంది పని చేస్తున్నట్లయిటే వారు ఈపీఎఫ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు. ఉదాహరణకు ఒక కంపెనీలో అప్పటిదాకా 19 మంది పని చేస్తుండగా.. కొత్తగా ఒక వ్యక్తి ఉద్యోగం పొందాడు. ఇప్పుడు ఆ కంపెనీ 20 మార్క్ను చేరుకుంది కాబట్టి 20 మంది ఈపీఎఫ్ కింద రిజిస్టర్ చేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా పొందింది ఒకరు.. రిజిస్ట్రేషన్ చేసుకున్నది మాత్రం 20 మంది. ఇలాంటి సందర్భాల్లో ఈపీఎఫ్ నమోదు ఆధారంగా ఉద్యోగాల సృష్టిని ఎలా అంచనా వేస్తారు' అని వ్యాస్ ప్రశ్నించారు. ఈపీఎఫ్కు, ఉద్యోగాల సృష్టికి ఏ మాత్రమూ సంబంధం లేదని మరొక ఆర్థిక నిపుణుడు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న ఉద్యోగి కూడా ఇప్పుడు ఈపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకునే ఆస్కారమున్నదని, అలాంటి సందర్భాల్లో ఉద్యోగాల కల్పనను ఎలా లెక్కించగలమని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
అప్పు తెచ్చి వాహనం కొన్నా ఉద్యోగమేనా ?
ఉన్నత విద్యను పూర్తి చేసిన లక్షలాది మంది ఉద్యోగాలు లేక బతుకుదెరువు కోసం అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. అప్పు తెచ్చి మరీ ఆటోలు కొని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నవారు అనేకం. ఫైనాన్స్లో వాహనాలు కొనుగోలు చేసి నడుపుతున్న వారెందరో.. ఎందరో నిరుద్యోగులు ట్యాక్సీలు నడుపుతున్నారు. వీరు పడుతున్న ఈ శ్రమ వెనుక అంతులేని విషాదం దాగి ఉన్నది. కానీ, ఇదంతా ఉద్యోగ సృష్టేనని చెప్పడంలో వాస్తవమెంత అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్రంపై ఇప్పటికే గుర్రుగా ఉన్న నిరుద్యోగ యువతకు మోడీ మాటలు.. పుండు మీద కారం చల్లినంత పని చేసింది. వ్యవసాయం చేస్తున్న ఒక రైతు.. పంటను తరలించేందుకు కొత్తగా ట్రక్కును కొనుగోలు చేస్తే.. అది కూడా ఉద్యోగ సృష్టేనా అని వ్యాస్ విమర్శించారు. ఉద్యోగ సృష్టిని అంచనా వేసేందుకు మోడీ ఎంచుకున్న విధానం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. కేంద్రం చేసిన కుటుంబ సర్వేను మోడీ ప్రస్తావించలేదని తెలిపారు. ఈ సర్వే ఆధారంగా ఉద్యోగాల కల్పనను అంచనా వేసే అవకాశమున్నా మోడీ దాన్ని పక్కనబెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
కొత్తగా 3.79 లక్షల ఉద్యోగాల సృష్టి
నిరుద్యోగిత రేటు పెరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో రెండేండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో 3.79 లక్షల ఉద్యోగాలను కొత్తగా సృష్టించామని కేంద్రం ప్రకటించింది. 2017-18లో 2,51,279 ఉద్యోగాల కల్పన జరగగా.. ఈ సంఖ్య ఈ యేడాది మార్చి 1 నాటికి 3,79,544కు చేరుకుంటుందని మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనలో రైల్వేశాఖ మొదటి స్థానంలో ఉండగా.. పోలీసు డిపార్ట్మెంట్, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల శాఖలు తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు బడ్జెట్ గణాంకాలను బట్టి తెలుస్తున్నది. రైల్వేలో మార్చి 1 నాటికి కొత్తగా 98,999 ఉద్యోగాల కల్పన జరుగుతుందని కేంద్రం ప్రకటించింది. అంతేకాక పోలీసు శాఖలో మార్చి 1 నాటికి 79,353, పన్నుల విభాగంలో 39,448 ఉద్యోగాలను సృష్టించనున్నట్టు తెలిపింది. కాగా.. ఇప్పటివరకు సృష్టించిన ఉద్యోగాల వివరాలు పేర్కొనాల్సింది పోయి.. రాబోయే కాలాన్ని కేంద్రం ప్రస్తావించడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉద్యోగాలు సృష్టిస్తున్నామని చెబుతున్న కేంద్రం, దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న ఖాళీలు ఎన్ని ? వాటి భర్తీ కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారన్న దానిపై ఎలాంటి వివరణా ఇవ్వకపోవడం గమనార్హం.