Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది దేశ సంస్కృతికి వ్యతిరేకం
- బీజేపీ సర్కారు మరోసారి అధికారంలోకి రాదు : యశ్వంత్ సిన్హా
గువహతి : పౌరసత్వ (సవరణ) బిల్లు 2016 మన దేశ సంస్కృతికి వ్యతిరేకమని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. రాజ్యసభలో ఈ బిల్లు పాస్ కాదని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్రంలో బీజేపీ సర్కారు రెండోసారి అధికారం రాబోదని అన్నారు. గువహతిలో 'అసోం నాగరిక్ సమాజ్' ఆదివారం నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఒక్కసీటు కూడా గెలవకుండా ప్రజలు ఏకమవ్వాలని కోరారు. 'పార్లమెంటులోని ఉభయసభలు వాయిదాలు పడుతున్నాయి. బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ పౌరసత్వ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఈ బిల్లును పాస్ చేయగలుగుతుందా అనేది అనుమానమే. ప్రస్తుత సర్కారు పాలనలో ఇదే చివరి పార్లమెంటు సెషన్ కానుండటంతో, ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం లేద'ని అన్నారు. 2014లో 31శాతం ఓట్లను సాధించిన బీజేపీ పార్టీ ఐదేండ్లు అధికారంలో ఉందన్నారు. 69శాతం ఓట్లు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడ్డాయని తెలిపారు. మరోసారి ఈ సర్కారు అధికారంలోకి రాబోదని చెప్పారు. ఒకవేళ ప్రస్తుత ప్రధాని మళ్లీ వస్తే.. దేశంలో కాస్తో కూస్తో ఉన్న ప్రజాస్వామ్యమూ పోతుందని అన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు నిలబడాలని కోరారు. తమ అస్థిత్వం కోసం పోరాడుతున్న అస్సామీలకు మద్దతుగా ఉంటాననీ తెలిపారు.