Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వేచ్ఛా, స్వాతంత్య్రానికి విఘాతం
- మోరల్ పోలిసింగ్ను పెడుతున్న కేంద్రం ఏజెంట్లు
- మోడీ సర్కారుపై బాలీవుడ్ నటుడు అమోల్ పాలేకర్ ఆగ్రహం
- పలుసార్లు ప్రసంగానికి అడ్డు..మాట్లాడకుండా మైక్ కట్
న్యూఢిల్లీ : మేథావులు, పౌర హక్కుల నేతలు, సినీ, కళారంగాల ప్రముఖులు ఇలా ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే మోడీ సర్కార్ సహించలేకపోతోంది. వారి గొంతు ను అణగదొక్కుతున్నది. బాలీవుడ్ అలనాటి మేటి నటుడు అమోల్ పాలేకర్కు తాజాగా ఎదురైన అనుభవమే ఇందుకు సాక్ష్యం. గత శుక్రవారం ముంబయిలోని 'నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్' (ఎన్జీయంఏ) ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్య క్రమంలో అమోల్ పాలేకర్ ప్రసంగాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటనను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్తో పాటు పలువురు తీవ్రంగా ఖండించారు.
ఈ ఘటన అనంతరం అమోల్ పాలేకర్ ఆదివారం పూణెలో మీడియాతో మాట్లాడుతూ...''ఆర్ట్ ఎగ్జిబిషన్లో కేవ లం సాంస్కృతిక శాఖ అనుమతించిన వాటినే ప్రదర్శిస్తున్నారు. మిగతా కళాకారుల ప్రదర్శనలను అనుమతించలేదు. నన్ను పిలిచిన సందర్భం వేరైనప్పటికీ కొన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చింది. హాజరైన కార్యక్రమం 'ఎన్జీయంఏ' ఏర్పాటుచేసింది కాబట్టే నేను కూడా దీనికి సంబంధించిన అంశాలే మాట్లాడాను. ఇందులో అసందర్భమేమీ లేదు. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లు మోరల్ పోలిసింగ్కు పాల్పడుతున్నారు'' అని అన్నారు.
ఇంతకీ అమోల్ పాలేకర్ ఏమన్నారు?
ఎన్జీయంఏ ఏర్పాటుచేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమోల్ పాలేకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ తీరును ఆయన తప్పుబట్టారు. ముంబయి, బెంగుళూరు సలహా కమిటీలను రద్దుచేసి, ఎగ్జిబిషన్లో స్థానిక కళాకారులకు అవకాశం లేకుండా చేశారని ఆయన విమర్శించారు. దీనికంతటికీ కారణం ఢిల్లీలోని పాలకులు, వారి ఏజెంట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాలేకర్ ప్రసంగాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్తో సహా, ఇతర అధికారులు బలవంతంగా అడ్డుకున్నారు. వేదిక దిగి వెళ్లాల్సిందిగా పదే పదే ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ''ఇంతకు ముందు ఆర్ట్ ఎగ్జిబిషన్లో స్థానిక కళాకారులు నేరుగా పాల్గొనేవారు. ఇప్పుడా అవకాశం లేకుండా చేశారు. ఢిల్లీ ఆదేశాలతో స్థానిక కమిటీలను రద్దుచేశారు. పాత కమిటీ రద్దయితే కొత్త కమిటీ వేయాలి కదా! కళా ప్రదర్శనలో 'థీమ్', 'కంటెంట్' అన్నవి కళాకారుడి స్వేచ్ఛకు వదిలేయాలి. ఎవరి కళా ప్రదర్శనలు ఇక్కడ ఉండాలి? ఉండవద్దు?అన్నది స్థానిక కమిటీ నిర్ణయించాలిగానీ, కేంద్రంలోని బ్యూరోక్రాట్స్ కాదు''అని సమావేశంలో అమోల్ పాలేకర్ చెబుతుండగా కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు పదే పదే ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
దీనికి అంతమెక్కడీ
మధ్య మధ్యలో కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు అడ్డు పడుతున్నా, పాలేకర్ మాట్లాడుతూ...'నేడు జరుగుతున్న పరిణామలపై చాలా ఆందోళన చెందుతున్నా. నిజంగా నేను చాలా చాలా 'డిస్ట్రబ్' అయ్యాను. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు రోజు రోజూకీ దెబ్బతింటున్నాయి. దీనికి ముగింపు ఎక్కడుంటుంది? ఇదంతా చూస్తూ మనం మౌనంగా ఉండాలా?''అని అవేదన వ్యక్తం చేశారు.
విమర్శించే హక్కు ఉంది : సీతారాం ఏచూరి
కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే నాయకుల్ని, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికీ ఉంది. ఇది మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదే అత్యంత ప్రధానమైనది కూడా. అమోల్ పాలేకర్ స్వేచ్ఛగా చేస్తున్న విమర్శను అడ్డుకోవటం ఎంతమాత్రమూ సరైంది కాదు. దీనిని మేము ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.