Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈవీఎం పంపిణీదారులకు పేమెంట్స్
- అనుమతి కోరిన కేంద్రం
న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు), పేపర్ ట్రయల్ మిషన్లు పంపిణీదారులకు ఈ ఆర్ధిక సంవత్సరం నుంచి రూ. 1,637 కోట్లు చెల్లించడానికి అనుమతించాలని న్యాయ మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మొత్తాన్ని పంపిణీ సంస్థలు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు వేసవిలో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం అధునాతమైన ఎం3 రకం ఈవీఎంలను తయారు చేసే బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. సుమారు 22.3 లక్షల బాల్లెట్ యూనిట్స్, 16.3 లక్షల కంట్రోల్ యూనిట్లును ఎన్నికల సంఘం కోసం రెండు సంస్థలు తయారు చేయాల్సి ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సుమారు 22.3 లక్షల బాల్లెట్ యూనిట్స్, 16.3 లక్షల కంట్రోల్ యూనిట్లు, 17.3 లక్షల వీవీపీఏటీలు (పేపర్ ట్రయల్ మిషన్లు) ఉపయోగించనున్నారని అంచనా. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 10.6 లక్షల పోలింగ్ స్టేషన్లలో ఈ యంత్రాలను ఉపయోగిస్తారు. ఏకకాల ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రం రెండు వేరువేరు ఈవీఎం సెట్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకటి పార్లమెంటరీ నియోజకవర్గం కోసం, మరొకటి అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఉపయోగిస్తారు. ఒక వేళ వీవీపీఏటీలో సమస్య తలెత్తితే, రిజర్వ్గా ఉంచి వివిపిఎటితో దానిని భర్తీ చేస్తారు. అయితే బాలెట్ యూనిట్లో కానీ, కంట్రోల్ యూనిట్లో కానీ సమస్య తలెత్తితే మొత్తం సెట్నే (బాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీపీఏటీ) మారుస్తారు.
కాగా, 2000 నుంచి ఇప్పటి వరకూ 113 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, మూడు లోక్సభ ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించారు. ఓటింగ్ విధానాన్ని మళ్లీ బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా ఎన్నికల సంఘం ఈవీఎంల వైపే మెగ్గు చూపుతుంది.