Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భిన్నంగా వెబ్సైట్లో నోటీసుల అప్లోడ్
- ఉద్దేశపూర్వకంగానే మార్చినట్టుగా విచారణలో వెల్లడి
- ఇద్దరు సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్లపై వేటు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కాం) చైర్మెన్ అనిల్ అంబానీ సుప్రీంకోర్టు ధిక్కరణ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్కాం- ఎరిక్సన్ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును మార్చేసి.. తప్పుడు తీర్పును వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దీంతో సుప్రీంకోర్టులో పనిచేసే ఇద్దరు అధికారులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ విధుల నుంచి తొలగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కోర్టు నిర్ధేశించినప్పటికీ ఉద్ధేశపూర్వకంగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపు తమ బకాయిలను చెల్లించడం లేదంటూ ఎరిక్సన్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎరిక్సన్ ఇండియా పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ రొహింటన్ ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ శరణ్ నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 7న అనిల్ అంబానీ, మరికొందరు రిలయన్స్ ప్రతినిధులకు కోర్టు ధిక్కరణ కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ సహా మిగతా అందరూ వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట తప్పక హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ నారిమన్ బెంచ్ ఆదేశాలను జనవరి 7న సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అయితే అందులో ధర్మాసనం ఆదేశాలకు భిన్నంగా.. 'ధిక్కరణకు పాల్పడిన వారు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదు' అని ప్రకటితమైంది. దీంతో ఈ విషయాన్ని గమనించిన ఎరిక్సన్ సంస్థ ప్రతినిధులు ఆ సంస్థ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేలు జస్టిస్ నారిమన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెబ్సైట్లో ఉన్న తప్పుడు తీర్పును చూసి ఆశ్చర్యానికి గురైన జస్టిస్ నారిమన్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే తప్పును సరిచేయించారు. అనుమానాలకు తావిచ్చిన ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) కోరారు. విచారణలో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పు అని తేలింది. సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న మానవ్ శర్మ, తపన్ కుమార్ చక్రవర్తి కావాలనే తీర్పును మార్చినట్లు విచారణలో బయటపడింది. దీంతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ కి తన విశేషాధికారాలతో మానవ్ శర్మ, తపన్ కుమార్లను విధుల నుంచి తొలగించారు. కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకున్న అనిల్ అంబానీ, రిలయన్స్ టెలికాం చైర్మెన్ సతీశ్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్పర్సన్ ఛాయ విరానీ ఫిబ్రవరి 12,13న సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ కేసులో తీర్పును రిజర్వ్లో పెట్టింది.
తీర్పు ఎందుకు మారింది..!
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్ అంబానీకి సంబంధించిన కీలక కేసులో తప్పుడు తీర్పు వెబ్సైట్లో అప్లోడ్ అవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎంతో అనుభవం కలిగిన అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పని చేస్తున్న చోట ఇలాంటి చర్యలు జరగడం వెనుక కొన్ని అదృశ్యం శక్తులు పని చేసి ఉంటాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.