Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్ర పంజా
- 44 మంది జవాన్లు హతం
- 'మందుగుండు' కారుతో ఆత్మాహుతి దాడి.. కాల్పులు
- జైషే మహమ్మద్ దుశ్చర్య... పారిన రక్తపుటేరులు
- కాశ్మీర్లోని పుల్వామాలో ముష్కరుల హింస
- ఉగ్రదాడిని ఖండించిన యావత్తు భారతదేశం
ఓవైపు కురుస్తున్న మంచును చీల్చుకుంటూ..జమ్మూ నుంచి శ్రీనగర్కు 70 వాహనాల్లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ బయలు దేరింది.. వాహనాల్లో జవాన్లు వెళ్తుండగా..మాటు వేసిన ముష్కరమూకలు అమాంతంగా తెగబడ్డాయి. భారీ మందుగుండు సామాగ్రితో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. దీంతో 44 మంది జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెప్పపాటులో నరమేధం సృష్టించిన పుల్వామాలోని అవంతిపొరా ప్రాంతమంతా రక్తం ఏరులైపారింది. ఉగ్రదాడితో తునాతునకలైన బస్సు..ఎటు చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మాంసపు ముద్దలు. మారణకాండకు అమాయక జవాన్లు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దాడికి తమదే బాధ్యత అంటూ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. గడిచిన 20 ఏండ్లలో జమ్మూకాశ్మీర్లో ఇదే పెద్ద దాడి అని అక్కడి భద్రతా సిబ్బంది చెబుతున్నారు. ఉగ్ర మారణహౌమాన్ని యావత్ భారతం ఖండించింది.
శ్రీనగర్ : కాశ్మీర్లో మరో మారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ లక్ష్యంగా హింసాత్మక దాడికి తెగబడిన ఘటనలో 44 మంది జవాన్లు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జమ్మూ-కాశ్మీర్ హైవేపై గురువారం వెళ్తున్న సీఆర్పీఎఫ్ భారీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు పక్కా ప్లాన్తో దాడి చేశారు. 70 వాహనాలతో కూడిన కాన్వాయ్ పుల్వామాలోని అవంతిపోరా ప్రాంతానికి గురువారం మధ్యాహ్నం 3.35 గంటలకు చేరుకున్నది. కాగా.. పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని కలిగి ఉన్న కారు.. కాన్వాయ్ లోని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. కారు నడుపుతున్న వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడ్డాడు.
కారు ఢీ కొట్టిన తర్వాత అక్కడ కాపు కాసి ఉన్న ఉగ్రవాదులు.. జవాన్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు. ఘటనా స్థలిలోనే పది మందికి పైగా జవాన్లు ప్రాణాలొదిలారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరింపజేసినట్టు సీఆర్పీఎఫ్ డీజీ ఆర్ఆర్ భట్నాగర్ తెలిపారు. అంతేకాక దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్టు వివరించారు. మరోవైపు ఉగ్రదాడికి భద్రతా వైఫల్యమే కారణమని వస్తున్న ఆరోపణలను ఉన్నతాధికారులు కొట్టి పారేస్తున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యకు యావత్తు భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది. ఈ ఘాతుకాన్ని పిరికి చర్యగా అభివర్ణించింది.
ఆత్మాహుతికి పాల్పడింది కాశ్మీరీయే..
జవాన్ల కాన్వాయ్ పై తామే దాడి జరిపామంటూ జైషే మహ్మమద్ సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో కాశ్మీర్ యువకుడు అదిల్ అహ్మద్ దార్ ఆత్మాహుతికి(కారు నడిపిన వ్యక్తి) పాల్పడినట్టు వెల్లడించింది. దాడికి ముందు అదిల్ అహ్మద్ మాట్లాడిన వీడియో ఫుటేజీని సైతం జైషే విడుదల చేసింది. కాకాపోరా జిల్లాలోని గండీబాగ్ ప్రాంతానికి చెందిన అదిల్.. గతేడాది జైషేలో చేరాడు. 'జైషేలో చేరి ఏడాదైంది. నాకు ఆత్మాహుతి దాడి బాధ్యతను అప్పగించారు. ఈ వీడియో బయటికొచ్చేసరికి నేను బ్రతికి ఉండను. కాశ్మీర్ ప్రజలకు ఇదే నా చివరి సందేశం' అని వీడియో ఫుటేజీలో అదిల్ మాట్లాడాడు.
2001 తర్వాతే ఇదే పెద్ద దాడి
జమ్మూ కాశ్మీర్లో 2001 తర్వాత ఇదే అతి పెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. 2001లో ఆ రాష్ట్ర అసెంబ్లీ గేటు వద్ద ముష్కరులు కారు బాంబుతో ఆత్మాహుతికి తెగబడ్డారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
మోడీ పాలనలో 18వ ఉగ్రదాడి : కాంగ్రెస్
కేంద్రంలో మోడీ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ఉగ్రదాడుల్లో ఇది 18వ ఘటన అని కాంగ్రెస్ విమర్శిం చింది. ఉరీ, పాంపోర్, పటాన్కోట్, గురుదాస్పూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఉగ్రదాడులు అనేకమని ఆ పార్టీ ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా అన్నారు. ఇంత జరుగుతున్నా ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నదని ఆయన ప్రశ్నించారు. '56 అడుగుల ఛాతి ఇప్పుడు ఎక్కడీ' అంటూ మోడీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
బదులు తీర్చుకుంటాం : రాజ్నాథ్సింగ్
ఉగ్రవాదుల దాడికి బదులు తీర్చుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ హెచ్చరించారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని అన్నారు. దాడిలో చనిపోయిన జవాన్లకు దేశం మొత్తం నివాళ్లర్పిస్తోందని తెలిపారు.
షాక్కు గురి చేసింది : కేజ్రీవాల్
పుల్వామా ఉగ్రదాడి విషయం తెలియగానే షాక్కు గురైనట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉగ్రవాదుల ఘాతుకాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి : మమతా బెనర్జీ
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లు త్వరగా కోలుకోవాలి.
రాష్ట్రపతి ఖండన
ఉగ్రదాడిని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
వారి బాధ అర్థం చేసుకోగలను : ప్రియాంకాగాంధీ
అమరులైన జవాన్ల కుటుంబీకులు అనుభవించే బాధను అర్థం చేసుకోగలని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్రప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
త్యాగం వృథా కాదు : మోడీ
జవాన్లపై ఉగ్రదాడి హేయ మైన చర్య అని ప్రధాని మోడీ అన్నారు. దాడిని ఖండిస్తూ ఆయన ట్వీట్ చేశారు. జవాన్ల త్యాగం వృథాగా పోదని తెలిపారు. అమరులైన జవాన్ల కుటుంబీ కులకు దేశమంతా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు.
పిరికి చర్య : రాహుల్
జైషే ఉగ్రవాదుల హింసాత్మక దాడి పిరికి చర్య అని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్గాంధీ విమర్శించారు. ఉగ్రదాడి విషయం తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యాన న్నారు.
దాడి అమానుషం : సీపీఐ(ఎం)
పుల్వామాలో ఉగ్రవాదుల దుశ్చర్యను సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. 'కాశ్మీర్ సమస్యను పరిష్కారం కోసం రాజకీయపరమైన ప్రక్రియను ప్రారంభిస్తామని మోడీ ప్రభుత్వం మూడేండ్ల కిందట చెప్పింది. జమ్మూకాశ్మీర్లోని నేతలతో సంప్రదింపులు కూడా జరుపుతామని తెలిపింది. కానీ, ఇది జరగలేదు' అని పొలిట్బ్యూరో విమర్శించింది. ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసింది. జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతలను సవ్యంగా ఉంచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో ఈ సందర్భంగా తెలిపింది.