Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర సమాచార కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు
- ఆరునెలల్లోగా ఖాళీల్ని నింపాల్సిందే..
న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్ నియామకానికి ఎలాంటి ప్రక్రియను అనుసరించామో, అదే ప్రక్రియలో 'కేంద్ర సమాచార కమిషనర్'ను కూడా నియమించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లను బ్యూరోక్రాట్స్తో నింపటాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. సమాచార హక్కు కార్యకర్తలు దాఖలుచేసిన పిటీషన్లపై జస్టిస్ ఎ.కె.సిక్రీ, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కేంద్ర, రాష్ట్ర సీఐసీలలో ఖాళీల్ని ఆరునెలల్లోగా భర్తీచేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
దేశవ్యాప్తంగా 23,500 ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని సమాచార హక్కు కార్యకర్తలు అంజలీ భరద్వాజ్, లోకేష్ బాత్రా, అమృతా జోహ్రీలు సుప్రీంలో పిటీషన్ వేశారు. సీఐసీలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉండటంతో దరఖాస్తులు పేరుకుపోయాయనీ న్యాయస్థానానికి తెలిపారు. ప్రధాన ఎన్నికల అధికారి పదవి ఎంతటి ఉన్నతస్థాయిని కలిగివుందో..కేంద్ర సమాచార కమిషనర్ పదవీ అలాంటిదేనని శుక్రవారంనాడు విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి ఈసీ నియామకంలో ఎలాంటి ప్రక్రియ అనుసరిస్తామో, ఇకపై సీఐసీ నియామకంలోనూ అలాంటి పద్ధతే పాటించాలని తీర్పు చెప్పింది. రాష్ట్రాల సీఐసీల నియామకాలు రెండునెలల్లోగా ప్రారంభించాలని ఆదేశాల్లో పెర్కొన్నది. రాష్ట్రాల సీఐసీలుగా పనిచేసిన అనుభవమున్నవారికి కేంద్ర సీఐసీలో అవకాశం ఇవ్వాలని సుప్రీం తెలిపింది.