Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడి ప్రభావం త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై ఏవిధంగా ఉంటుందన్నదానిపై బీజేపీ వర్గాల్లో భిన్నాభిప్రా యాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీని ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోగల నేతగా సంఫ్ పరివార్ ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం పుల్వామా వద్ద జైషే మహ్మద్కు చెందిన ఆత్మాహుతి దళసభ్యుడు పేలుడు పదార్థాలతో నింపిన సుమోవ్యాన్తో సీఆర్పీఎఫ్ కాన్వారుని ఢ కొట్టగా, 40మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ సంఘటన ప్రధాని మోడీకి తాము అనునయించిన బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజి చేస్తుందన్న ఆందోళన సంఫ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ సంఘటనతో అందరి దృష్టీ ఉగ్రవాదంపై మళ్లుతుందని, దాంతో ఇప్పుడు ప్రధాని మోడీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలన్నీ మరుగున పడ్తాయని పాజిటివ్గా కూడా ఆలోచిస్తున్నట్టు కొందరు చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం, రాఫెల్ డీల్లో తన స్నేహితుడికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రధాని మోడీ జోక్యంపై ప్రతిపక్షాల విమర్శలు తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ జరిగిన ఈ ఆకస్మిక సంఘటన ప్రభావం ఏవిధంగా ఉంటుందన్నదానిపై ఎవరూ ఓ స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. ఉగ్రదాడికి పథకం పన్నిన దోషులను శిక్షించడం కోసం మోడీ సర్కార్ చేపట్టే చర్యల ఆధారంగా ప్రభావం ఉంటుందని బీజేపీలోని కొన్నివర్గాలు చెబుతున్నాయి. 2008 ముంబయి దాడుల వల్ల అప్పటి యూపీఏపై వ్యతిరేక ప్రభావం చూపలేదని, అందువల్లే 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగలిగిందని మరోవైపు మోడీ అనుకూలవర్గాలు అంచనా వేస్తున్నాయి.
శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ 130 కోట్ల భారతీయుల తరఫున పుల్వామా ఉగ్రదాడికి దీటుగా జవాబిస్తామంటూ హెచ్చరించారు. తదుపరి చర్యలు చేపట్టేందుకు భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పారు. పాకిస్థాన్ను ఉద్దేశిస్తూ మన పొరుగు దేశం భారత్ ఇప్పుడు నూతన విధానాలతో వెళ్తున్న విషయం మరిచిపోయినట్టుగా ఉన్నదని ప్రధాని అన్నారు. మరోవైపు సంఫ్ పరివార్ నుంచీ ప్రధాని మోడీపై ఒత్తిడి పెరుగుతున్నట్టుగా జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. పుల్వామా సంఘటన తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ ఈ సంఘటనపై ప్రభుత్వం నుంచి తగిన చర్యను అంచనా వేస్తున్నామన్నారు. పలువురు బీజేపీ ఎంపీలు, నేతలు ఉగ్రదాడి సంఘటనపై ఘాటుగానే స్పందించారు. ఉగ్రవాదులకు మరిచిపోలేని గుణపాఠం చెబుతామని ఆర్థికశాఖమంత్రి అరుణ్జైట్లీ హెచ్చరించారు.