Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : పంజాబ్లోని జలియన్ వాలా బాగ్ స్మృతి కేంద్రంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవు తున్నాయి. జలియన్వాలాబాగ్ మారణకాండకు 100 ఏళ్లు పూర్తవుతున్న ప్రస్తుత సమయంలో అక్కడి స్మృతి చిహ్నాలు, జ్ఞాపకాలు కళావిహీనమై మసకబారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని తొలి భారత ప్రభుత్వం నాటి మారణకాండ జరిగిన ప్రదేశాన్ని జాతీయ స్మారక ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలి సిందే. ప్రస్తుతం ఈ ప్రాంత నిర్వహణపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటురాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవటంతో నాటి పోరాట యోధుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన ఈ స్మారక కేంద్రం కళతప్పింది. ఈ ప్రాంత పరిస్థితిని వివరిస్తూ ఇటీ వల సిపిఎం ఎంపి ఎంబి రాజేష్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ స్మారక కేంద్రానికి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన 'లైట్ అండ్ సౌండ్ షో' ను పునఃప్రారంభించేదుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ఆయన ప్రధానిని కోరారు. 'సన్ ఎట్ లూమిరి' పేరుతో 52 నిముషాల నిడివి వున్న సౌండ్ అండ్ లైట్షోను ఐదేళ్ల క్రితం వరకూ ఇక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. తాను ఇటీవల ఈ చారిత్రక ప్రదేశాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించానని రాజేష్ తన లేఖలో వివరించారు. నిధుల కొరతతో ఈ లైట్ అండ్ సౌండ్ షో నిలిచి పోయినట్లు అక్కడి సిబ్బంది తనకు తెలిపారని ఆయన వెల్లడించారు. జాతీయ ఐక్యతా విగ్రహం పేరిట రు.3 వేలకోట్లు వెచ్చించిన ప్రభుత్వం జలియన్ వాలాబాగ్ శతాబ్ది సంవత్సరంలో నాటి 3 వేల మంది అమరుల కుటుంబా లకు కనీసం రూపాయి వంతున కూడా సాయం చేయటంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ స్మారక కేంద్రం ప్రతి రోజూ దాదాపు 35 వేల మందికి పైగా పర్యాటకులు సందర్శించే ప్రముఖ పర్యాటక కేంద్రమైన స్వర్ణ దేవాలయానికి అత్యంత సమీపంలోనే వుండటం విశేషం.