Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం
నవ తెలంగాణ - న్యూ ఢిల్లీ బ్యూరో
కాకతీయ ఓపెన్ కాస్ట్ (ఉపరితల గని) - 2 నుంచి 500 మీటర్ల లోపు పేలుళ్ళు తక్షణమే నిలిపి వేయాలని సింగరేణి (ఎస్సీసీఎల్) సంస్థను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధి కాకతీయ ఓపెన్కాస్ట్లలో నియమ నిబంధనలకు విరుద్ధంగా 500 మీటర్లలోపే పేలుళ్ళు జరుపుతున్నారని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ ప్రాథమిక నిబంధనలు కూడా కాలరాస్తున్నారని స్థానికుడు నాగవెళ్ళి రాజలింగమూర్తి ఎన్జీటీని ఆశ్రయించారు. కేంద్ర పర్యావరణ శాఖ అఫడవిట్లో తేడాలను గమనించిన జస్టిస్ రాఘవేంద్ర ఎస్ రాథోడ్ ధర్మాసనం నిబంధనలకు విరుద్ధంగా జరుపుతున్నారని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా 500 మీటర్లలోపు పేలుళ్ళను తక్షణమే నిలిపివేయాలని సింగరేణి సంస్థను ఆదేశించింది. పేలుళ్ళ ప్రభావం సమీప గ్రామాలపై ఎలా ఉందో పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గనుల శాఖ డైరెక్టరేట్ జనరల్ని ఎన్జీటీ ధర్మాసనం ఆదేశించింది. ఇష్టారీతిన పేలుళ్ళ కారణంగా సమీపంగా నివసిస్తున్న గ్రామ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని... వ్యాధుల పాలవుతున్నారని పిటీషనర్ తరపున న్యాయవాది శ్రావణ్కుమార్
ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎన్జీటీ ధర్మాసనం పూర్తి నివేదికను సమర్పించేంతవరకు పేలుళ్ళు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ విషయమై కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సంయుక్త తనిఖీలు నిర్వహిం చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతోపాటు రాజలింగమూర్తి పిటీషన్పై విచారణ ముగిసిందని ఎన్జీటీ ధర్మాసనం కేసు విచారణ అనంతరం వ్యాఖ్యానించింది. గనుల శాఖ నివేదిక, కేంద్ర పర్యావరణ శాఖ, పీసీబీల జాయింట్ రిపోర్టు ఆధారంగా కేసు విచారణ చేపడతామని గ్రీన్ ట్రిబ్యూనల్ ధర్మాసనం వెల్లడించింది.