Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉరి నుంచి పుల్వామా మారణహోమం వరకూ..
న్యూఢిల్లీ : 2016 సెప్టెంబరులో ఉరీలో సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడి తరువాత మరో మారణహోమానికి పుల్వామా వేదికైంది. దాడికి పాల్పడిన విధానం, జరిగిన నష్టంతో పోలిస్తే మాత్రం గత అన్ని ఘటనలకంటే ఇది చాలా త్రీవమైన దాడి. యావత్ సమాజం ఖండించాలి. ఖండించింది. ఖండనలతోపాటు.. ప్రతీకార చర్యలు తీసుకోవాలన్న డిమాండూ ప్రధానంగా వినిపిస్తున్నది. 'మీకు పూర్తి స్వేచ్ఛ నిస్తున్నాం... ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం, ప్రదేశం నిర్ణయించండండి' అంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భారీ ప్రకటననే చేశారు. మంత్రుల నుంచి ఉన్నతాధికారుల వరకూ అలాంటి వాదనలే ముందుకొస్తున్నాయి.
ప్రతీకారంపైనే ప్రభుత్వాల దృష్టి
ప్రాణాలను పణంగా పెట్టి సైనికులు పోరాడుతుంటే.. ఇలాంటి హింసాత్మక పరిస్థితులను తప్పించాల్సిన నైతిక బాధ్యత అధికార పెద్దలది. మరి వారు ఆ ప్రాతను పోషిస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. గత 7 దశాబ్దాల్లో.. ముఖ్యంగా తిరుగుబాటు మొదలైన 1990ల నుంచి కాశ్మీర్ వివాదం విషయంలో అన్ని ప్రభుత్వాలదీ ఒకే తీరు. ప్రతీకారదాడులపైనే ప్రభుత్వాలు దృష్టిసారిస్తున్నాయి. దాని వల్ల కశ్మీర్ లోయకు, భారత్కు నష్టం తప్ప మరొకటికాదు. అగ్గి రాజేయడమే తప్ప చల్లార్చే చర్యలకు ఉపక్రమించడంలేదు. సైనికులు, పౌరుల మారణాలను ఆపే దిశగా పరిష్కారాలను ఆలోచించాలి.
కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సంక్షోభ పరిష్కారం దిశగా కాకుండా.. విరామం లేకుండా సాగిస్తున్న సైనిక విధానం ద్వారా సంక్షోభం మరింత ముదిరేలా వ్యవహరిస్తోంది. 2016 నుంచి కాశ్మీర్ ప్రజల విషయంలో బుల్లెట్లు, పెల్లెట్ల దాడులతో అక్కడి ప్రజలపై విరుచుకుపడుతున్నది. శాంతియుత మార్గంలో గట్టి ప్రయత్నాలు చేస్తే తప్ప కాశ్మీర్ లోయలో రక్తపుటేరులు ఆగవు. అలాగే పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం, ఆ దేశంతో చర్చలు ప్రారంభించడం వంటివి అవసరం.
మోడీ ప్రభుత్వం వచ్చాక...
2014 నుంచి 2018 వరకు రాష్ట్రంలో తీవ్రవాదానికి సంబంధించిన సంఘటనల్లో 339 మంది సైనికులు మారణహౌమానికి బలైనట్టు ప్రభుత్వమే ప్రకటించింది. కాగా, దక్షిణ ఆసియా టెర్రరిజం పోర్టల్ రూపొందించిన గణాంకాల ప్రకారం 2014 నుంచి 2018 వరకూ 402 సైనికులు తీవ్రవాద దాడులలో మృతిచెందారు.
2016 - 2018 మధ్య కాలంలో 398 మంది తీవ్రవాదులు జమ్మూకాశ్మీర్లోకి చొరబడినట్టు కేంద్ర హౌం శాఖ ఇటీవలే రాజ్యసభకు తెలిపింది. అయితే, ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అదే కాలంలో 620 మంది తీవ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. రాష్ట్రంలో తీవ్రవాదానికి సంబంధించిన హింసాకాండలో మరణించిన పౌరుల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. 2014 - 2018 మధ్య రాష్ట్రంలో మొత్తం 674 ఘటనలలో 202 పౌరులు, 917 తీవ్రవాదులు చనిపోయినట్టు దక్షిణ ఆసియా టెర్రరిజం పోర్టల్ ప్రకటించింది. పఠాన్కోట్, ఉరి తదితర ఉగ్రదాడుల సమయంలోనూ మిగతా పార్టీలను భేటీకి పిలవని మోడీ సర్కార్.. పుల్వామా దాడి తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేశామని చెప్పిన తర్వాత.. ఆ దాడుల గురించి వివరించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అది కేవలం సమాచారం ఇచ్చుకోవడం కోసమే గానీ సంప్రదింపుల కోసం కాదు. ఆ తర్వాత కాశ్మీర్ సమస్యపై అఖిలపక్షం వేయడం ఇదే ప్రథమం.