Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 15 నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్లు
- జూన్ 12 నుంచి ఉద్యోగ బాధ్యతలు
- కోర్టు కేసులతో 6 కేటగిరీల పోస్టుల నిలిపివేత
రాజమహేంద్రవరం: రాష్ట్రంలో రెండు విడతలుగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ను మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథిగృహంలో శుక్రవారం విడుదల చేశారు. ఎస్జీటీలో 50.13 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 7,902 పోస్టులకు గాను 6,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. కోర్టు కేసుల కారణంగా ఆరు కేటగిరీలకు చెందిన పోస్టులకు మెరిట్ లిస్టులను ప్రకటించలేదు. కోర్టు కేసులు క్లియర్ అయిన తర్వాత వాటిని భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు మే 15న ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తామని, వారితో మే 30న ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయిస్తారని చెప్పారు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకూ ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందన్నారు. జూన్ 12 నుంచి వారు విధుల్లో చేరుతారని తెలిపారు. ఎస్జీటీ, ఎస్ఎ, లాంగ్వేజ్ పండిట్లకు ఆయా జిల్లా విద్యాశాఖల ద్వారా నియామక పత్రాలు అందిస్తామని చెప్పారు. జిల్లాస్థాయిలో మెరిట్ ఆధారంగా నియామకాలు ఉంటాయన్నారు. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్స్, ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్, క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ల ఎంపిక రాష్ట్రస్థాయి మెరిట్ లిస్ట్ ఆధారంగా జరుగుతుందన్నారు.
డీఎస్సీ 2018కి గతేడాది అక్టోబర్ 26న రాజమహేంద్రవరంలోనే నోటిఫికేషన్ విడుదల చేశామని, తిరిగి ఇక్కడే ఫలితాలను ప్రకటిస్తున్నామని చెప్పారు. మొత్తం 7,902 పోస్టులకు గాను ప్రస్తుతం 6,241 పోస్టులను భర్తీ చేయనున్నామని తెలిపారు. డీఎస్సీ పరీక్షలకు 6,08,155 మంది దరఖాస్తు చేసుకున్నారని, 5,89,165 మందికి హాల్టిక్కెట్లు అందించామని చెప్పారు. పరీక్షలకు 5,05,547 మంది (85.81 శాతం) హాజరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి, ఎంఎల్ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎంఎల్సి ఆదిరెడ్డి అప్పారావు, మేయర్ పంతం రజనీ శేషసాయి తదితరులు పాల్గొన్నారు.