Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిఘాలోనా? నిర్లక్ష్యమా?
- పాక్తో దౌత్య, రాజకీయ సంబంధాలు దెబ్బతినటమా?
- రాష్ట్ర సీఐడీ హెచ్చరించినా..తీసిపారేసిన కేంద్ర హోం శాఖ
పోఖ్రాన్ అణు పరీక్షలు, సర్జికల్ దాడులు..ఇవేవీ 'పుల్వామా'దాడిని ఆపలేకపోయాయి. దౌత్యపరమైన ప్రయత్నాలు, రాజకీయ చర్చలు చేసివుంటే లోయలో ఉగ్రవాద ముఠాలకు పాక్ నుంచి సాయం అందేది కాదు. 'కాశ్మీర్' విషయంలో మోడీ సర్కార్ వేసిన తప్పటడుగులు ఈ పరిణామాలకు దారి తీశాయనిపిస్తోంది. పాక్తో శత్రుత్వం, ఆ దేశం పట్ల విద్వేషం...పెంచే విధంగా మోడీ సర్కార్ ఆలోచనలు ఉన్నాయి. ఎన్నికలవేళ సైతం దీనిని ప్రధాన అంశంగా వాడుకోవాలన్న తాపత్రయం ఇందులో కనపబడుతోంది. కాశ్మీర్లోయలో గురువారంనాటి తీవ్రవాద దాడి దేశప్రజలందర్నీ షాక్కు గురిచేసింది.
న్యూఢిల్లీ : దేశం యావత్తు పుల్వామా దాడి గురించి చర్చిస్తోంది. ప్రతీకారాన్ని, భావోద్వేగాన్ని రగిలించే మాటలతో కాశ్మీర్ సమస్యకు సమాధానం దొరకదని జాతీయ, అంతర్జాతీయ రక్షణరంగ, విదేశీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జమ్మూకాశ్మీర్ నేతలతో, పాక్తో రాజకీయ చర్చలు జరపకపోవటమూ సమస్యని మరింత జటిలం చేసిందని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. నిఘా వర్గాల వైఫల్యంపై శుక్రవారం జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది.
పుల్వామా ఉగ్రదాడి సమాచారం మనకు ముందే అందిందా? జమ్మూకాశ్మీర్ సీఐడీ అధికారులు చేరవేసిన సమాచారాన్ని కేంద్ర హోం శాఖ అధికారవర్గాలు పెడచెవిన పెట్టాయా? 44మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవటం వెనుక నిర్లక్ష్యం ఉందా?అంటే అవుననే సమాధానం వస్తోంది. జైషే మహ్మమద్, లష్కరే తోయిబా సభ్యుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలని విన్నామని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సీఐడీ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. వీటి ద్వారా కాశ్మీర్ లోయలో పలు చోట్ల 'ఫిదాయీ' (ఆత్మాహుతి) దాడులు దిగుతున్నట్టు తేలింది. తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కూడా కారు లేదా ట్రక్ బాంబు దాడికి ప్రణాళిక వేస్తుందని కేంద్ర హోం శాఖతో జరిగిన సమావేశంలో రాష్ట్ర సీఐడీ స్పష్టం చేసిందని మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
అయితే ఇలాంటి దాడుల్ని అడ్డుకోవడానికి అవకాశాలు లేవని కేంద్ర హోంశాఖ వర్గాలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. జనవరి 3నాడు రాష్ట్ర సీఐడీ వర్గాలు ఓ నివేదికను తయారుచేశాయి. అందులో ఏముందంటే, పుల్వామా దాడి కోసం ఆఫ్ఘాన్ తీవ్రవాది 'అబ్దుల్ రషీద్ ఘాజీ' అనే అతడ్ని జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ రంగంలోకి దించాడు. ఇటీవల భద్రతా బలగాలు జరిపిన ఆపరేషన్లో మసూద్ అజార్ బంధువులు ఉస్మాన్, తల్హా రషీద్ మొదలైనవారు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా బాంబు తయారీ నిపుణుడు 'ఘాజీ'ని కాశ్మీర్ లోయలోకి పంపాలని అజార్ నిర్ణయించారు. కొంతమందికి శిక్షణ ఇప్పించి పేలుళ్లు జరపాలన్నది అజార్ ప్రణాళిక
రెండురోజుల ముందు..ట్విట్టర్లో వీడియో !
కాశ్మీర్లోయలో ఉగ్రదాడి జరగడానికి రెండు రోజుల ముందు ట్విట్టర్లో ఓ వీడియో హల్చల్ చేసింది. ఇదే విషయాన్ని జమ్ముకాశ్మీర్ పోలీసులు కేంద్ర నిఘా వర్గాలకు ముందే చెప్పినట్టు తెలుస్తోంది. ఓ ప్రయివేటు ట్విట్టర్ ఖాతాలో ఆత్మాహుతి దాడికి సంబంధించిన 33 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియో రెండు రోజుల క్రితం కనిపించింది. అఫ్ఘనిస్తాన్ నుంచి ఈ వీడియో అప్లోడ్ అయినట్టు తెలిసింది. అందులో ఓ కార్ బాంబు దాడి గురించి చూపారు. ఇలాంటిదే కాశ్మీర్లోనూ చేయబోతున్నామన్న సందేశాన్ని జేఈఎం తెలిపింది. అయితే ట్విట్టర్ ఖాతాను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనేది కనిపెట్టేందుకు భద్రతా ఏజెన్సీలు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఈ వీడియోను పరిశీలించిన జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఉగ్రదాడిని ముందుగానే అనుమానించారు. దీనిపై రెండు ఉగ్రవాద సంస్థలు పనిచేసినట్టు సమాచారం. 2001లో కాశ్మీర్ అసెంబ్లీ వద్ద ఏ విధంగా అయితే పేలుడు పదార్ధాలతో కూడిన వాహనంతో వెళ్లి ఆత్మాహుతి దాడి చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా చేయాలని జైషే ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.