Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుల్వామా ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు
- అమర జవాన్ల గ్రామాల్లో విషాద ఛాయలు
- మారణకాండను ఖండించిన యావత్తు ప్రజానీకం..
- నేడు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు
నవతెలంగాణ - జనరల్ డెస్క్
పుల్వామాలో జైషే సృష్టించిన నరమేధంపై యావత్తు భారతం భగ్గుమన్నది. ఈ ఘాతుకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు మిన్నంటాయి. ఉగ్రవాదుల దుశ్చర్యను రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, సినీ, క్రీడా ప్రముఖులు, యువత, విద్యార్థి లోకం.. ఇలా అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండించాయి. వీరమరణం పొందిన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించాయి. ఉగ్రవాదుల హింసాకాండలో మృతుల సంఖ్య 49కి చేరుకున్నది.
జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపోరాలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చిన తమ నిరసనను తెలియజేశారు. ఉగ్రవాదం నశించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పలు చోట్ల పాకిస్థాన్ జెండాలను తగులబెట్టారు. జవాన్ల ప్రాణత్యాగానికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ నినదించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. అంతేకాదు.. ప్రపంచ దేశాలు సైతం భారత్కు బాసటగా నిలిచాయి. మరోవైపు.. అమర జవాన్ల సొంత గ్రామాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. భార్యతో మాట్లాడుతూ ఒకరు.. రెండు నెలల్లో తిరిగొస్తానంటూ మరొక జవాను.. పసిబిడ్డను కళ్లారా చూసుకోకుండానే.. ఉన్న ఒక్క కొడుకూ దూరమై.. ఇలా చెప్పుకుంటూ పోతే అమర సైనికుల కుటుంబాల్లో అంతులేని విషాదం అలుముకున్నది. జమ్మూ-శ్రీనగర్ హైవేపై 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లతో గురువారం వెళ్తున్న కాన్వారుపై జైషే మహమ్మద్ మారణహోమానికి దిగడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. 350 కిలోల మందుగుండు సామాగ్రిని కలిగి ఉన్న కారు.. కాన్వారులోని ఒక బస్సును ఢకొీట్టడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. కాశ్మీరీ యువకుడు అదిల్ కారును నడుపుతూ ఆత్మాహుతికి తెగబడ్డాడు. ఈ ఘటనలో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మాంసపు ముద్దలు కొన్ని మీటర్ల మేర ఎగిరిపడ్డాయి. ఒక జవాను మృతదేహం 80 మీటర్ల దూరంలో ఎగిరి పడిందంటే పేలుడు తీవ్రతను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మృతుల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాన్ని ప్రకటించాయి.
కేంద్రానికి పూర్తి మద్దతు : రాహుల్గాంధీ
ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రానికి, సైన్యానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రకటించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే ఉగ్రవాదం లక్ష్యమని అన్నారు. కానీ, దేశాన్ని ఎవ్వరూ విడగొట్టలేరని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతిపక్షాలు మొత్తం కేంద్రప్రభుత్వానికి అండగా ఉన్నాయని తెలిపారు. రాజకీయపరమైన వివాదాలకు సమాధానం ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని రాహుల్ అన్నారు.
పాక్ రాయబారికి సమన్లు
జైషే దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం.. దేశంలోని పాకిస్థాన్ హైకమిషనర్ సోహైల్కు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆయనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిపించుకున్నది. ఉగ్రదాడిపై విదేశాంగ కార్యదర్శి విజరు గోఖలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైషే మహమ్మద్పై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని సోహైల్కు గోఖలే స్పష్టం చేశారు.
పాలం ఎయిర్పోర్టులో అమరులకు నివాళి
పాల్గొన్న మోడీ, రాహుల్, కేంద్రమంత్రులు
ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్టులో అమర జవాన్లకు నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో మోడీ, రాహుల్గాంధీ, కేంద్రమంత్రులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి జవాన్ల భౌతికకాయాలను వారి సొంత ప్రాంతాలకు తరలించనున్నారు. శనివారం అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు జరగనున్నాయి. అంతకుముందు కాశ్మీర్లోని బుడ్గాం ఎయిర్బేస్లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాజ్నాథ్సింగ్ పాల్గొనడమే కాక.. జవాను శవపేటికను స్వయంగా మోసుకుంటూ వెళ్లి వాహనంలో ఎక్కించారు.
భార్యతో ఫోన్ మాట్లాడుతుండగానే...
ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రదీప్ కుమార్ తన భార్య నీరజతో మాట్లాడుతూ యోగ క్షేమాలు తెలుసుకుంటున్నాడు. ఇంతలోనే ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. నీరజ ఎంత ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. కొద్ది నిమిషాలకే టీవీలో ఉగ్రదాడి వార్త. ఏమైందో ఏమో అనుకునే లోనే ఉగ్రదాడిలో ప్రదీప్ చనిపోయాడంటూ ఫోన్ కాల్.. ఇద్దరు పిల్లలున్న ఆ కుటుంబానికి ఇప్పుడు భరోసా లేకుండా పోయింది.
పసిబిడ్డను చూడకుండానే..
రాజస్థాన్కు చెందిన రోహితాశ్కు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆయన భార్య మూడు నెలల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. హోలీ సెలవులకు వెళ్లి బిడ్డను చూడాలని, ఎత్తుకొని లాలించాలని రోహితాశ్ ఎన్నో కలలు కన్నాడు. కానీ, ఆ కలలని ముష్కరదాడి కల్లలు చేసింది. రోహితాశ్ మరణ వార్త వినగానే అతని సోదరుడు జితేంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
గర్వంగా ఉంది : అమర జవాను కూతురు
ఒడిషాకు చెందిన ప్రసన్న కుమార్ సాహూకు కూతురు రోసీ, కొడుకు జగన్ ఉన్నారు. వారిద్దరూ ప్రస్తుతం కాలేజీలో చదువుతున్నారు. కాగా.. తండ్రి మరణం తన కుటుంబాన్ని దిగ్భ్రాంతికి లోను చేసిందని రోసీ తెలిపింది. అయితే.. దేశం కోసం ఆయన ప్రాణాలర్పించినందుకూ గర్వంగా కూడా ఉందని ఆమె చెప్పడం గమనార్హం. ప్రసన్న కుమార్ మృతి పట్ల ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు.
జమ్మూలో టెన్షన్.. కర్ఫ్యూ విధింపు
ఉగ్రదాడికి వ్యతిరేకంగా జమ్మూ నగరంలో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆందోళనకారులు పలు వాహనాలను నిప్పు పెట్టడమే కాక.. ప్రజలపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో నగరంలో కర్ఫ్యూ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కర్ఫ్యూ విధించిన విషయాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా పోలీసులు చెబుతూ.. షాపులు, మార్కెట్లన్నింటినీ మూసివేయించారు. అక్కడ పెద్ద ఎత్తున బలగాలను మోహరించిన పోలీసు ఉన్నతాధికారులు.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
నేడు అఖిలపక్ష సమావేశం
దేశంలోని ప్రధాన పార్టీలతో అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పార్లమెంటు లైబ్రరీలో శనివారం అఖిలపక్ష సమావేశం జరగనున్నది. ఉగ్రదాడి, తదనంతర పరిణామాలు, మున్ముందు చేపట్టబోయే చర్యలను హోంమంత్రి రాజ్నాథ్సింగ్ వివరించనున్నట్టు సమాచారం. అంతేకాక.. పుల్వామా ఘటనకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్రం తీసుకోనున్నది. మరోవైపు.. అత్యంత అభిమాన దేశాల జాబితా నుంచి పాక్ను ఉపసంహరించుకోవాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి అరుణ్జైట్లీ తెలిపారు. పాక్ను ఏకాకిని చేసేలా చర్యలు చేపడుతున్నట్టు జైట్లీ వెల్లడించారు.
ఎలా బదులిస్తారో మీ ఇష్టం : మోడీ
పుల్వామా ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోడీ.. ఈ ఘటనకు ఎలా సమాధానం చెబుతారో మీ ఇష్టమంటూ సైనిక బలగాలను ఉద్దేశించి మాట్లాడారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రతీకారం తీర్చుకుంటారన్నది వారి సొంత నిర్ణయానికే వదిలేస్తున్నానన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అనుమతులు ఇస్తున్నామని, ఇదే భారత్ నూతన విధానమని ఆయన ప్రకటించారు. ఉగ్రవాదుల మారణకాండపై దేశ ప్రజల రక్తం మరుగుతోందని తెలిపారు. కిరాతక చర్యలకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కలిసిగట్టుగా ముందుకు రావాలని అంతర్జాతీయ సమాజానికి మోడీ పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవస్థలో చిక్కుకున్న ఓ దేశం సాయం కోసం ఇతర దేశాల చుట్టూ తిరుగుతున్నదని పాకిస్థాన్ను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే భారత్ను కూడా అదే గతి పట్టించాలని ఆ దేశం భావిస్తోందని తెలిపారు. ఇలాంటి దాడులతో దేశాన్ని అస్థిరపరచలేరని అన్నారు.
మరో కొడుకును పంపుతా..
బీహార్కు చెందిన జవాన్ ఠాకూర్ మృతి విషయం తెలియగానే ఆయన తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. తన కొడుకు వీర మరణం పొందినందుకు గర్వంగా ఉందని అన్నారు. దేశం కోసం పోరాడేందుకు మరో కొడుకు పంపించడానికైనా తాను సిద్ధమని ప్రకటించాడు. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.